రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారన్నారు. హిందూ మనోభావాలను కించపరుస్తున్నారని.. వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయం గాయపడుతోందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. పోలీసులతో పాటు ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్నారు. మాటలతో ప్రభుత్వం మభ్య పెడుతోందని సోమువీర్రాజు విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో అధికార వైసీపీ ఫాస్టర్స్ కి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తోందని.. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అదే అధికార పార్టీ ఎజెండాగా మారిపోయిందని అన్నారు. శ్రీశైలంలో రజాక్ బంధువులు రాజ్యం ఏలుతున్నారని.. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ముస్లింలను రెచ్చగొట్టుడుతున్నారని అన్నారు.
యువకులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎలక్ట్రికల్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, ఉపాధ్యాయ రంగాల్లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయడం లేదని విమర్శించారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తామని చెప్పారని, కానీ ఆ పోస్టులే భర్తీ చేయడం లేదని తెలిపారు. యూపీ లాంటి సీఎం ఏపీకి అవసరమని అన్నారు. ఇంధనంపై రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే.. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారి కూడా తగ్గించలేదని అన్నారు. ఈ విషయంలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంగా వాడుకున్నారని నాడు జగన్ ఆరోపించారని.. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారని, ఇద్దరూ తోడుదొంగలని విమర్శించారు.