More

    నాడు నెహ్రూ నిర్లక్ష్యం.. నేడు మోదీ హయాంలో పటేల్ కల సాకారం..!

    సోమ్‎నాథ్ దేవాలయం. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లాంగాల్లో ఒకటైన దివ్యక్షేత్రం. కాలనిర్ణయానికి ప్రమాణం. ఈ మహా పుణ్యధామాన్ని.. సాక్షాత్తు చంద్రుడే నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. అలాంటి మహోన్నత ఆలయం.. విదేశీయుల దాడుల్లో ఎన్నోసార్లు విధ్వంసానికి గురైంది. భారతదేశంపై దాడిచేసి, ప్రజల్ని హింసించి.. ఇక్కడి సంపదను దోచుకున్న మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖల్జీ, గుజరాత్ సుల్తానులు, ఔరంగజేబు వంటి ఎందరో ఇస్లామిక్ ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అలా అరబ్బులు, మహమ్మదీయుల దండయాత్రల్లో ఒకటి రెండు‎సార్లు కాదు, ఏకంగా 17 సార్లు ధ్వంసం చేయబడింది సోమ్ నాథ్ దేవాలయం. కానీ, భక్తుల దృఢ సంకల్పం వల్ల ధ్వంసం అయిన ప్రతీసారి మళ్లీ పునర్నించబడింది. అయితే, దేశవిభజన తర్వాత కూడా సోమ్‎నాథ్ దేవాలయం నిర్లక్ష్యానికి గురైంది. లౌకికవాదుల పాలనలో హిందూ పునరుజ్జీవమే బూతుపదంగా మారిపోయిన నేపథ్యంలో.. ఏళ్లతరబడి శిథిలావస్థలోనే వుంది. హిందూ సంస్కృతికి ప్రతీకలను తృణప్రాయంగా భావించిన ది గ్రేట్ నెహ్రూ నిర్లక్ష్యంతో పునర్నిర్మాణం మరింత కష్టతరంగా మారింది.

    ఇన్నాళ్లకు, దేశానికి స్వాతంత్ర్యం లభించిన ఏడున్నర దశాబ్దాల తర్వాత.. సోమ్‎నాథ్ ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంది. అయోధ్య, వారణాసి, ఉత్తరాఖండ్‎లోని ఎన్నో పురాతన కట్టడాలు పునర్నితమవుతున్నాయి. ఉత్తరాఖండ్‎లోని బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలుపుతూ 12 వేల కోట్లతో చార్‎ధామ్ హైవే నిర్మితమవుతోంది. మోదీ హయాంలో హైందవ సంస్కృతి పునరుజ్జీవం పొందుతోందని చెప్పడానికి ఇవే ప్రతక్ష్య సాక్ష్యాలు.

    ఇటీవల గుజరాత్‌లోని సౌరాష్ట్ర జిల్లాలో వున్న సోమ్‎నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పర్యాటక శాఖ శ్రీపాద్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రతీర విహారయాత్రలో భాగమైన ‘సముద్ర దర్శన పాత్’, సోమ్‎నాథ్ శిథిలాలను ప్రదర్శించే సోమ్‎నాథ్ ఎగ్జిబిషన్ గ్యాలరీతోపాటు.. సోమ్‎నాథ్ కాంప్లెక్స్‌లోని పురాతన దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గతంలో సోమ్‎నాథ్ దేవాలయంపై జరిగిన విధ్వంసాన్ని గుర్తుచేసుకున్నారు. ఉగ్రవాద పునాదులపై ఏర్పడిన విధ్వంసకర శక్తులు దీర్ఘకాలం మనుగడ సాగించలేవని అన్నారు. అవి అప్పుడప్పుడూ ఆధిపత్యం ప్రదర్శించవచ్చు, కానీ, శాశ్వతంగా నిలబడలేవన్నారు. అంతేకాదు, అలాంటి విధ్వంసకర శక్తులు మానవత్వాన్ని ఎక్కువ కాలం అణిచివుంచలేవని.. పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభాన్ని ఎత్తిచూపారు.

    సోమ్‎నాథ్ దేవాలయాన్ని పునర్నిర్మాణంతో.. ఆ పురాతన ఆలయానికి పునరుజ్జీవం కల్పించాలన్న సర్దార్ పటేల్ కల నెరవేరిందని అన్నారు ప్రధాని మోదీ. 1947 నవంబర్ 13న, అరేబియా సముద్రం నుండి కొంత నీటిని తీసుకునసోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలని సర్దార్ పటేల్ ఆనాడే ప్రతిజ్ఙ చేశారు. కానీ, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రం.. సోమ్‎నాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని పట్టించుకోలేదు. జవహర్‌లాల్ నెహ్రూతో పాటు మౌలానా ఆజాద్ వంటి వాళ్లు ఆలయాన్ని పునర్నిర్మాణానికి అడ్డుపడ్డారు. ఎక్కడ హిందుత్వం పునరుజ్జీవం పొందుతుందోనని నెహ్రూ భావిస్తే.. వారసత్వ కట్టడాన్ని సాధ్యమైనంత మేకు శిథిలావస్థలోనే ఉంచేందుకు మౌలానా ఆజాద్ ప్రయత్నించారు. అయితే, నెహ్రూ సుముఖంగా లేనప్పటికీ,.. సర్దార్ పటేల్ చొరవతో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది. అయితే, ఆలయ పునర్మిర్మాణాన్ని ఆయన చూడలేకపోయారు.

    హిందూ సంస్కృతిపై నెహ్రూ ద్వేషానికి అవధులు లేవు. అందుకే, ఆలయ ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుండి మట్టి, నీరు, ఇతర వస్తువులను సేకరించడం కోసం.. భారత ప్రభుత్వ విదేశీ కార్యాలయాలను ఉపయోగించడాన్ని కూడా ఆ వ్యక్తి వ్యతిరేకించాడు. తన కేబినెట్ సహచరులైన కె.ఎం. మున్షి, ఎన్.వి. గాడ్గిల్ వంటివాళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. కేబినెట్ పర్మిషన్ లేకుండా దేవాలయ పునర్నిర్మాణం చేపట్టడం పెదవి విరిచారు.

    అంతేకాదు, అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, రాజేంద్ర ప్రసాద్ మాత్రం నెహ్రూ వైఖరిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు, అదే సమయంలో వేడుకకు ముందు రాజీనామా కూడా చేశారు. ఇదిలావుంటే, డాక్టర్ రాజేంద్రప్రసాద్ దేవాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి పత్రికా ప్రకటన ఇవ్వకుండా.. నాటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను నెహ్రూ అడ్డుకున్నారట. దీనిని బట్టి హిందుత్వం పట్ల జవహర్ లాల్ నెహ్రూకు ఉన్న ద్వేషానికి ఇది అద్దం పడుతుంది.

    ఏదేమైనా, ఏడున్నర దశాబ్దాల తర్వాత.. సోమ్‎నాథ్ ఆలయం మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటోంది. సోమ్‎నాథ్ ఆలయం అభివృద్ధికి.. ప్రధాని మోదీ అన్ని వనరుల్ని సమకూర్చుతున్నారు. అంతేకాదు, సోమ్‎నాథ్ ట్రస్ట్ కు మోదీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా సభ్యుడిగా వున్నారు. దేశంలో పురాతన ఆలయాల పురోభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టు వుందనడానికి ఇదే నిదర్శనం. త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘ఐకానిక్ డెస్టినేషన్ డెవలప్ మెంట్ స్కీమ్’ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ ఈ స్కీమ్ కు ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. అదే జరిగితే, దేశవ్యాప్తంగా వున్న సోమ్‎నాథ్ వంటి చారిత్రక కట్టడాల దశ తిరుగుతుంది.

    సోమ్‎నాథ్ ప్రాజెక్ట్ కోసం 282 కోట్లు కేటాయించారు. వీటిలో 111 కోట్లు ‘ఐకానిక్ డెస్టినేషన్ డెవలప్ మెంట్ స్కీమ్’ ద్వారా లభించనున్నాయి. మిగతా 171 కోట్లను సోమనాథ్ ట్రస్ట్, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా.. సోమ్‎నాథ్ కాంప్లెక్స్ చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీప్లేన్స్, ఫెర్రీ సర్వీసులతో పాటు.. పర్యాటకుల కోసం కేశోద్ ఎయిర్ పోర్టును కూడా నిర్మించనున్నారు. అంతేకాదు, IDDS ఫండ్స్ తో, కొత్త షాపింగ్ కాంప్లెక్స్, హెరిటేజ్ వాక్, కొత్త మ్యూజియం, గీతా టెంపుల్, త్రివేణి సంగం వద్ద కొత్త రివర్ ఫ్రంట్ తో పాటు, ఎకో విలేజ్ ను కూడా నిర్మించనున్నారు. ఏదేమైనా, దశాబ్దాలుగా శిథిలావస్థలో వున్న సోమ్‎నాథ్ దేవాలయాన్ని పునరుజ్జీవాన్ని అందించడం భారతీయుడు ఆహ్వానించదగిన పరిణామం.

    Trending Stories

    Related Stories