ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం 4.07గంటలకు ఆయన మరణించినట్లు కిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన వయసు 66 సంవత్సరాలు. న్యుమోనియాతో నవంబర్ 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారని కిమ్స్ ఆసుపత్రి తెలిపింది. ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
1986లో విడుదలైన ‘సిరివెన్నెల’ చిత్రంతో గేయ రచయిత సినీ ప్రస్థానాన్ని సీతారామశాస్త్రి ప్రారంభించారు. తొలి సినిమాతోనే ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. మూడున్నర దశాబ్దాలుగా ఆయన ఎన్నో వేల పాటలను రాశారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పాటలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. స్వయంకృషి, స్వర్ణ కమలం, శ్రుతిలయలు, గాయం, స్వాతి కిరణం, క్షణ క్షణం, సింధూరం, నువ్వే కావాలి, ఒక్కడు, వర్షం, గమ్యం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళల రంగంలో ఆయన చేసిన కృషికి 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆయన మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఒక గొప్ప జాతీయవాది అయిన ఆయన.. సినీ పరిశ్రమలో 3000లకు పైగా పాటలు రాసి.. పదకొండు నంది అవార్డ్స్ అందుకున్న ఓ లెజెండ్ ఇప్పుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు.