సాధారణంగా ఏ ఇంటి గోడలనైనా ఇటుకలతో నిర్మిస్తారు. గోడను తవ్వి చూస్తే ఇటుకలే బయటపడుతుంటాయి. అయితే ముంబయిలోని ఒక వ్యాపార సంస్థ కార్యాలయం గోడలో మాత్రం కోట్ల రూపాయల నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. సుమారు పదికోట్ల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు.
చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం నేలలో, గోడలో ఏర్పాటుచేసిన రహస్య అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఆకంపెనీ లావాదేవీలను పరిశీలించిన జిఎస్టి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే చాముండా బులియన్ టర్నోవర్ రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరిగినట్లు గుర్తించారు. దీంతో జిఎస్టి అధికారులు కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై గత బుధవారం దాడులు నిర్వహించారు. గదిలో నేలపై ఏర్పాటుచేసిన టైల్స్ అధికారులు మరింత నిశితంగా పరిశీలించగా ఓ మూలన ఉన్నది కొద్దిగా భిన్నంగా కనిపించింది.
దీంతో ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి గదిని పరిశీలించి.. ఆ ఫలకను తొలగించి చూడగా గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులో నుంచీ నగదు నింపిన గోనె సంచులు బయటపడ్డాయి. ఈ సంచుల గురించి తమకేమీ తెలియదని కంపెనీ కార్యాలయ యజమాని, అతని కుటుంబసభ్యులు చెప్పడంతో అధికారులు ఆ గదిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నోట్ల కట్టలకు సంబంధించి చాముండిపై జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.