పాకిస్థాన్ పాలకులు సందర్భం వచ్చిన ప్రతిసారి భారత్పై విషం కక్కుతూనే ఉంటారు. ఆసియాలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే అది ఇండియా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
కశ్మీర్లో పూర్వపు స్థితిని నెలకొల్పాలని భారత్కు పిలుపునిచ్చారు. షెహబాజ్.. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అందులో కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చారు. జమ్ముకశ్మీర్లో వెంటనే 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని భారత్కు సూచించారు.
ఆసియాలో సుస్థిర శాంతి కోసం, 2019, ఆగస్టు 5 నాటి ఏకపక్ష, చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం భారతదేశ బాధ్యత. దీనిద్వారానే కశ్మీర్ సమస్య చర్చలతో పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. భవిష్యత్ తరాలు బాధపడాలని మనం ఎందుకు కోరుకుంటాం.. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కాశ్మీరీల అంచనాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరిద్దామని సూచించారు. దీనిద్వారా సరిహద్దుకు ఇరువైపులా పేదరికాన్ని అంతం చేయగలుగుతామని చెప్పారు.