ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయాల కేసులో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ ఏడుస్తూనే గడిపాడని అధికారులు చెప్పారు. అతడు నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ఆర్యన్ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉండేవాడని తెలిపారు. ఆర్యన్, అర్బాన్, మున్మున్లను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వారు ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన కొడుకును బెయిల్పై విడుదల చేయించడానికి షారుఖ్ లాయర్ ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నాడు. తన షూటింగ్ కార్యక్రమాలను కూడా షారుఖ్ వాయిదా వేసుకున్నాడు.
ఈ ఘటన తర్వాత షారుఖ్ ఖాన్ని కలవడానికి సల్మాన్ఖాన్ మన్నత్ చేరుకున్నాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత, సల్మాన్ ఖాన్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ బంగ్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఇంట్లోకి వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్యన్ ఖాన్ కేసు వాదించే బాధ్యతను క్రిమినల్ లాయర్ సతీష్ మానెషిండేకు అప్పజెప్పారు. ప్రముఖ లాయర్ రామ్జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్కు సంబంధించిన చాలా హైప్రొఫైల్ కేసులను ఆయనే వాదించారు. 1993లో బాంబే బ్లాస్ట్ కేసుకు సంబంధించి సంజయ్ దత్ తరఫున వాదించి బెయిల్ ఇప్పించింది ఆయనే..! 2002లో సల్మాన్ ఖాన్పై నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును కూడా సతీషే వాదించారు. 1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ తరఫున వాదనలు వినిపించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కూడా రియాచక్రవర్తి తరఫున సతీష్ వాదనలు వినిపించారు. తన క్లైంట్ను నిర్వాహకులే నౌకలోకి ఆహ్వానించారని సతీష్ చెబుతున్నారు.