దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. పోచెఫ్ స్ట్రూమ్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూల్చింది భారత్. ఆపై స్వల్ప లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ షెఫాలీ వర్మ 15, మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 5 పరుగులు చేశారు. గొంగడి త్రిష 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యాతివారి 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ బౌలింగ్ లో అద్భుతంగా రాణించింది. నియామ్ ఫియోనా హాలండ్ (10), ర్యానా మక్డోనాల్డ్ (19), సోఫియా స్మేల్ (10), అలెక్సా స్టోన్హౌస్(11) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సాధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలో రెండు వికెట్లు తీశారు.
సూపర్ స్టార్ షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు విశ్వ విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ICC అండర్-19 ప్రారంభ ఎడిషన్లో టైటిల్ గెలుచుకున్న భారత మహిళల జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నగదు బహుమతిని ప్రకటించింది. భారత మహిళల క్రికెట్లో ప్రపంచ టైటిల్ కోసం సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికిన ఉమెన్ ఇన్ బ్లూకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. మహిళల క్రికెట్లో భారతదేశం తొలి ICC టైటిల్ను గెలుచుకున్నందుకు భారత U-19 జట్టు, సహాయక సిబ్బంది సభ్యులకు బీసీసీఐ 5 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు.