రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లాలని ఓ అబ్బాయి, అమ్మాయి ప్రయత్నించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో రాష్ట్రపతి భవన్లోకి చొరబడ్డానికి ప్రయత్నించగా ఆ ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్లోని 35వ నంబర్ గేట్ ద్వారా ఓ అబ్బాయి, అమ్మాయి వాహనంలో వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రాష్ట్రపతి భవన్లో పెట్రోలింగ్ చేస్తున్న భద్రతా అధికారులు ఈ జంటను వెంటనే పట్టుకున్నారు. విచారణ అనంతరం వాళ్లను అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం వారు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడి పేరు శివమ్ అని అధికారులు తెలిపారు. అతను ఢిల్లీలోని సంగమ్ విహార్ నివాసి, అతనితో ఉన్న యువతి అతని స్నేహితురాలని అధికారులు తెలిపారు.
భద్రత నియమాలను ఉల్లంఘించినందుకు ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హ్యుందాయ్ ఐ-20 కారులో రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లాలని భావించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని అక్రమంగా ప్రవేశించడం, ప్రజా ఆస్తులకు నష్టం, మోటారు వాహనాల చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఫిర్యాదు మేరకు సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాత్రి 11:35 గంటలకు సంఘటన గురించి తమకు సందేశం అందిందని పోలీసులు తెలిపారు. కొన్ని బారికేడ్లను ఢీకొట్టి, ఒక గేటు నుంచి రాష్ట్రపతి భవన్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా బలవంతంగా మరియు అనధికారికంగా ప్రెసిడెంట్ ఎస్టేట్లోకి ప్రవేశించారు. వారిని వైద్య పరీక్షల కోసం వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి పంపారు.