More

    శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు జరిమానా

    బాలీవుడ్ పోర్న్ చిత్రాల కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు పోలీసుల విచారణను ఎదుర్కొంటూ ఉండగా.. మరో వైపు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వీరికి, వీరి కంపెనీ వియాన్ ఇండస్ట్రీస్ కి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రూల్స్ ను అతిక్రమించారనే కారణాలతో ఫైన్ విధించింది. వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)కు సంబంధించి 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ట్రేడింగ్/డీలింగ్ పై విచారణ జరిపామని సెబీ తెలిపింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, వియాన్ ఇండస్ట్రీస్ లు సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రెగ్యులేషన్స్ కు సంబంధించిన 7(2)(ఏ), 7(2)(బీ)లను అతిక్రమించారని విచారణలో తేలడంతో జరిమానా విధించింది. 2015లో తమ సంస్థకు చెందిన 5 లక్షల ఈక్విటీ షేర్లను నలుగురు వ్యక్తులకు ప్రిఫరెన్సియల్ అలాట్ మెంట్ ద్వారా కేటాయిస్తున్నామని వియాన్ ఇండస్ట్రీస్ తెలిపింది. వీటిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు 1,28,800 షేర్ల వంతున అలాట్ చేసిందని సెబీ వెల్లడించింది. అయితే, సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ నిబంధన 7(2)(ఏ) ప్రకారం… రూ. 10 లక్షలకు మించిన లావాదేవీలు జరిపితే రెండు ట్రేడింగ్ దినాల్లోనే పూర్తి వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రమోటర్లు అందజేయాల్సి ఉండగా.. వీరు ఆ పని చేయలేదు. శెట్టి, కుంద్రాలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్దారని.. తాము విధించిన రూ. 3 లక్షల జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.

    రాజ్ కుంద్రా ఈ నెల 19న అరెస్ట్ అయ్యాడు. రాజ్ కుంద్రా ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ను కూడా నిరాకరించింది. రాజ్ కుంద్రా కస్టడీని మరో రెండు వారాల పాటు కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని కోర్టు పొడిగించడం ఈ వారంలో ఇది మూడోసారి.

    Trending Stories

    Related Stories