తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న దృష్ట్యా, రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ వారంలో మరో మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు సోమవారం తిరిగి తెరచుకోనున్నాయి.
బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జులై 11 నుంచి 13 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెలవులను మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటనతో ఈ నెల 18న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.