మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యులు, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ముంబైలోని ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 19 వరకు పొడిగించింది. పాత్రా చాల్ మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేశారు. సంజయ్ రౌత్ బెయిల్ కోసం ఇంకా పిటిషన్ దాఖలు చేయలేదని ఆయన తరపు న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు. సంజయ్ రౌత్ ను పట్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఆరు గంటల పాటు విచారించిన తర్వాత ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. పాత్రాచాల్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగానే ఆగస్టు 1న ఈడీ అధికారులు సంజయ్ రౌత్ను అరెస్టు చేశారు. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా.. ఆ తర్వాత న్యాయస్థానం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఆ కస్టడీ సోమవారంతో ముగియడంతో సంజయ్ రౌత్ను కోర్టులో హజరుపర్చారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికాకపోవడంతో సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని పొడగించాలని ఇటీవల కోర్టులో ఈడీ దరఖాస్తు చేసింది. దీంతో ఈడీ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ఆయన కస్టడీని పొడగించింది.