గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా చెప్పుకుంటూ పోతే.. మనం నిత్యం వాడే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో 99 శాతం వరకు మన దేశానికి సంబంధించినవి కావు. వాటికి సంబంధించిన సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటాయి. దానర్ధం మన డేటా వారి గుప్పిట్లో ఉన్నట్లే.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచం తనని చూడట్లేదులే అని అనుకోవడంలో ఎంత మూర్ఖత్వం ఉందో.. మనం వాడుతున్న ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో మన ప్రైవసీకి ఢోకాలేదు అని అనుకోవడంలో కూడా అంతే మూర్ఖత్వం ఉంది. ముఖ్యంగా వాట్సాప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మధ్యనే తమ ప్రైవసీ నియామాలను మార్చి వినియోగదారుల ఆగ్రహానికి గురైన ఈ మెసేజింగ్ యాప్ రానున్న కాలంలో నిజంగానే అంత సేఫ్ యాప్ గా నిలవలేకపోవచ్చు.
ఇక భారత ప్రధాని మోదీ పిలుపుతో మేకిన్ ఇండియా మూమెంట్, ఆత్మనిర్భర భారత్ నినాదం ఊపందుకుందనే విషయం మనకు తెలిసిందే. చైనా అయినా అమెరికా అయినా ఎందుకు మనం ఇంకా వారిపైనా చిన్న చిన్న వాటికై కూడా డిపెండ్ కావడం ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. మన మేధస్సు విదేశీ కంపెనీలలో డాలర్ల వర్షం కురిపిస్తుంటే.. ఆ మేధస్సునే ఇక్కడ ఎందుకు ఉపయోగించరాదు.. దానికి సంబంధించిన అనుకూల పరిస్థితులు కేటాయించరాదు. గతమలా గడిచింది గానీ ప్రస్తుతానికి కేంద్రం మాత్రం మేడిన్ ఇండియాకే పెద్ద పీట వేస్తోంది.
అందులో భాగంగా ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న వాట్సాప్ కు దీటుగా, పోటీగా మన యాప్ ఒకటి గవర్నమెంట్ పరిచయం చేసింది. ఇందులో ఫీచర్లు ప్రారంభదశలోనే అబ్బురపరిచేలా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఆ యాప్ పేరే సందేశ్.
వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ను పరీక్షిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సందేశ్ యాప్ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఇన్స్టంట్ మెసేజింగ్ సిస్టమ్.. షార్ట్ ఫామ్ లో జిమ్స్.. ను అప్గ్రేడ్ చేసి సందేశ్ యాప్ను రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో పాటు వ్యక్తిగత వినియోగదారులకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇతర మెసేజింగ్ యాప్ల మాదిరిగానే సందేశ్ యాప్లో చాట్ లిస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్లో ఉన్నవారికి మెసేజ్లు పంపవచ్చు. గ్రూప్ చాట్, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మల్టీమీడియా కంటెంట్తో పాటు కాంటాక్ట్స్ షేరింగ్ ఆప్షన్ కూడా ఈ యాప్లో ఉంటుంది.
స్మార్ట్ఫోన్ యూజర్లు GIMS పోర్టల్ ద్వారా సందేశ్ యాప్ APK ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ 5.0, ఆ తరువాత వచ్చిన ఆండ్రాయిడ్ డివైజ్లలో పనిచేస్తుంది. iOS వినియోగదారులు నేరుగా యాప్ స్టోర్లో సందేశ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. iOS 12.0తో పనిచేసే ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్.. వంటి డివైజ్లలో ఈ యాప్ పనిచేస్తుంది.
యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తరువాత మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఇచ్చి సైన్ అప్ చేసుకోవాలి. ఇందుకు మొబైల్ నంబర్కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత వాట్సాప్ మాదిరిగానే ప్రొఫైల్ను ఎడిట్ చేసుకోవచ్చు. స్టేటస్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల మెసేజింగ్ సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ కేవలం ఈ-మెయిల్ ద్వారా యాప్లో రిజిస్టర్ చేసుకునేందుకు సాధారణ వ్యక్తులకు ప్రస్తుతం అనుమతి లేదు. కేవలం @gov.inతో ఉండే ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీలకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. దీంట్లో వాట్సాప్ మాదిరిగానే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఈ వ్యవస్థ భద్రతకు భరోసా కల్పిస్తుంది.
ఈ యాప్ ఇప్పటికే ఎటువంటి బగ్స్ లేకుండా ఉంది. రానున్న రోజుల్లో అప్ గ్రేడెడ్ వర్షన్ లో ఇంకా అద్భుతంగా ఉంటుంది అనడంలో ఢోకాలేదు. ట్విట్టర్ మన స్వదేశీ కూ అంత పోటీ ఇవ్వలేక పోయింది కానీ.. ఈ సందేశ్ యాప్ మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ ను మరిచిపోయేలా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..
మన ఫోన్ లో సందేశ్ యాప్ ఉండగా సందేహాలు ఎందుకు దండగా అని చెప్పుకోవచ్చు.. ఈ యాప్ ను మీరు డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను.. చూడండి..