బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను రెట్టింపు చేసింది. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర హోం శాఖ ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
పంజాబ్ సింగర్ సిద్ధూకు పట్టిన గతే సల్మాన్ ఖాన్కు కూడా పడుతుందని దుండగులు బెదిరింపు లేఖలో హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన సల్మాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా క్రైమ్బ్రాంచ్ పోలీసులు సల్మాన్ను కలిశారు. కాగా, పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాగా, గతంలో కూడా సల్మాన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ హత్యకు అతని ముఠా చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.