సకినాకా అత్యాచార ఘటనపై నోరు మెదపని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం.. సైలెంట్ గా ఉన్న రాహుల్, ప్రియాంక

నిర్భయ తరహా ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. వివాహిత మహిళ దారుణంగా అత్యాచారానికి గురైంది. సకినాకా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. మహిళపై గురువారం రాత్రి కొందరు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మర్మావయాల్లో ఇనుప రాడ్ జొప్పించి పైశాచిక ఆనందం పొందారు. ముంబై శివార్లలోని సకినాక ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఖైరానీ రోడ్డులో ఓ మహిళను ఓ వ్యక్తి కొడుతున్నాడని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడివుంది.

మహిళ పడి ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఉన్న టెంపో వ్యాన్ను పరిశీలించగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. కేసుకు సంబంధించి మోహన్ చౌహాన్ (45) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు బాధితురాలు మరణించడంతో ఆ కేసును అత్యాచారం, హత్యగా మార్చారు. మోహన్ చౌహాన్కు సిటీ కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. సత్వర విచారణ కోసం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు ముంబై పోలీసులు తెలిపాయి.
ముంబై శివార్లలోని సకినాక ఏరియాలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ టెంపో వ్యాన్లో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇనుపరాడ్డును ఆమె మర్మాంగంలోకి చొప్పించడంతో తీవ్రరక్తస్రావమైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను గట్కోపర్ రాజావాడి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని భావిస్తూ.. విచారణను ముమ్మరం చేశారు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త విడిచిపెట్టిన తర్వాత మృతురాలు ఒంటరిగా ఉంటున్నట్లు బాధితురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కేసులో సత్వరమే చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు ముంబై పోలీసులపై నిప్పులు చెరిగారు. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి అన్ని సహాయాలు అందించాలని ఆమె ముంబై పోలీసులను కోరారు.
ఇక ఈ ఘటన విషయంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు, అనేక మంది కార్యకర్తలు, సామాన్యులు సిఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో మహారాష్ట్రలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో జరిగిన ఘోరమైన నేరాలపై సిఎం ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు మరియు క్యాబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హత్రాస్ కేసు గురించి రాహుల్ మరియు ప్రియాంకా గాంధీ ఎంతగానో మాట్లాడారని.. ఈ దారుణ సంఘటన గురించి సోదరుడు సోదరి ఎందుకు మాట్లాడటం లేదని నెటిజన్లు ప్రశ్నించారు.