ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య కూడా స్నేహ సంబంధాలూ, మతపరమైన బంధాలూ ఉండవు. ఉన్నదల్లా దౌత్యపరమైన బంధాలే అంటారు విదేశాంగ నిపుణులు. అంటే ఒకరకంగా అన్ని దేశాలు కూడా ‘విన్ టు విన్’ సంబంధాలనే ఆశిస్తాయి. అందుకే రెండు పూర్తి ఇస్లామిక్ దేశాలైన అరబ్, యెమెన్కు మధ్య తరచూ యుద్దాలు జరుగుతుంటాయి. అదే సమయంలో మతపరంగా బద్ద శతృవులైన యూదు దేశం ఇజ్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాలను నెరుపుతోంది. ఇందులో యెమెన్ ఉగ్రవాదులతో అరబ్ సతమతమవుతుంటే,.. ఇజ్రాయెల్ టెక్నాలజీ అరబ్కు ఎంతో అవసరముంది. అందుకే ప్రపంచ దేశాల మధ్య ఉన్నదల్లా దౌత్యపరమైన సంబంధాలే అంటారు విదేశాంగ నిపుణులు.
ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న భారత్.. తన దౌత్య సంబంధాలను పక్కాప్రణాళికతో అమలు పరుస్తోంది. ఏ దేశానికీ గుడ్డిగా వంత పాడకుండా భారత్ కు నిజంగా ఏ దేశమైతే సహాయపడుతుందో ఆ దేశంతోనే ఎక్కువగా సంబంధాలు కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్దంలో కూడా భారత్ పక్కా దౌత్యనీతిని అనుసరించింది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ ఉక్రెయిన్ కే మద్దతిచ్చాయి. మరికొన్ని తటస్థంగా ఉన్నాయి. ఇందులో ఉక్రెయిన్ కు మద్దతిస్తూ అమెరికా వెంట నడిచిన అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. యూరప్, అమెరికా, జర్మన్ దేశాలన్నీ ముడిచమురు కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. యుద్దానికి ముందు ఆయా దేశాలకు ప్రధాన ఎగుమతి దారు రష్యానే ఉండేది. అటువంటి దేశంపై ఆంక్షలు విధించి చివరికి తమ చితిని తామే పేర్చుకున్నట్లయింది. అదే సమయంలో భారత్ మాత్రం ఏ దేశానికీ మద్దతివ్వకుండా తటస్థంగా ఉండి నష్టపోకుండా మరింత లాభాన్నే ఆర్జించింది. రష్యా తన ముడి చమురులో భారత్కు భారీగా డిస్కౌంట్లను ఇవ్వడంతో ఆ చమురును భారత్లో రిఫైనరీ చేసి తిరిగి అమెరికాకే అమ్మి భారీ లాభాలను సంపాదిస్తోంది. దీన్ని అమెరికా యూరప్ దేశాలు ఎంత వ్యతిరేకించినా కూడా.. ఏ మాత్రం వెనక్కు తగ్గటంలేదు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయా దేశాలకు దీటుగా సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో భారత్ను ఎదుర్కోలేక అగ్రదేశాలు మిన్నకుండిపోతున్నాయి.
ఇక ఇదిలావుండగా తాజాగా భారత్ కు రష్యా నుంచి ఊహించని మరో లాభం చేకూరింది. షాంఘై కో-ఆపరేటివ్ సదస్సులో రష్యా నుంచి భారత్ కు బలమైన మద్దతు లభించింది. భారత్లో అంతర్భాగాలైన కశ్మీర్, అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ అను భారత్ లోని భూభాగాలుగా గుర్తిస్తూ మ్యాప్ ను రిలీజ్ చేసింది. దీంతో అటు పాకిస్తాన్ కు ఇటు చైనాకు ఒకేసారి షాక్ ఇచ్చింది రష్యా. ఇన్నాళ్ళూ కశ్మీర్ను ఇరు దేశాల మధ్య సమస్యగానే గుర్తించిన రష్యా.. తాజాగా విడుదల చేసిన మ్యాప్లో కశ్మీర్ ను భారత్లో అంతర్భాగంగా పేర్కొంటోంది. ఇది అగ్రదేశాలకు కూడా ఏమాత్రం మింగురుపడని అంశమే అవుతోంది. ఇప్పటికీ అటు అమెరికా నుంచి చైనా వరకు కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా గుర్తించలేదు. కొద్దిరోజుల క్రితం అమెరికా దౌత్యాధికారి పీఓకేలో పర్యటించి కశ్మీర్ను ఆజాద్ కశ్మీర్ అని పేర్కొన్నాడు. అటు జర్మనీ కూడా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో చర్చజరపాలని చిలక పలుకులు పలికింది. ఇక చైనా అయితే కశ్మీర్ను, అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ను తన దేశంలోని భూభాగంలోనిదిగా చూపుతుంది. ఈ సమయంలో రష్యా మాత్రం ఈ భూభాగాలన్నిటినీ భారత్లో భాగంగా చూపడంతో భారత్కు ఒకింత ఉపశమనం లభించింది. ఇక్కడ భారత విదేశాంగ విధానం, దౌత్యం బాగా పనిచేశాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో రష్యా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా ఆ దేశంతో చమురును కొంటూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఈ భూభాగాలన్నిటినీ భారత్లో భాగంగా చూపింది రష్యా.
అందుకే ఏ దేశానికైనా దౌత్యం అనేది అత్యంత అవసరం. ఈ దౌత్య సంబంధాలు సరిగ్గా నెరపలేకపోవడం వల్లే.. 1962 ఇండో చైనా యుద్దంలో, 1971 లో ఇండో పాకిస్తాన్ యుద్దంలో, 1999 లో కార్గిల్ యుద్దంలోనూ భారత్ ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్తాన్తో జరిగిన రెండు యుద్దాల్లోనూ భారత్ గెలిచినా.. పీఓజేకేను స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇందులో విదేశాంగ విధానం కొట్టొచ్చినట్లు కనిపించింది. అందుకే మరోసారి ఇటువంటి పరిస్థితి భారత్కు రాకూడదనే విదేశాంగ విధానాన్ని మోదీ, జైశంకర్ పూర్తిగా బలోపేతం చేశారు. వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.