దేశంలో మసీదు, మందిరాల వివాదం మరింత ముదురుతోంది. జ్ఙానవాపి మసీదుతో మొదలైన వివాదం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు మసీదులపై కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. అలాగే మసీదుల మాటున మందిరాలు ఉన్నాయని పలువురు కోర్టు మెట్లెక్కుతున్నారు.
దేశ రాజధానిలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడం కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న మొఘల్ మసీదులో నమాజ్ చేయడంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిషేధం విధించిందని మసీద్ ఇమామ్ మౌలానా షేర్ మహమ్మద్ తెలిపారు. తాను గత 47 సంవత్సరాలుగా ఇమామ్గా కొనసాగుతున్నానని చెప్పారు. అయితే, దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సంరక్షిస్తున్న కట్టడాలు, స్థలాల్లో మతపరమైన ఆచారాలకు అనుమతి ఇస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఏఎస్ఐ విధానాల ప్రకారం.. ఇతర ప్రదేశాల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించినట్లు చెప్పారు.
ఇందుకు కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ఇప్పటికే ఈ నిబంధన ఉందని వెల్లడించారు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో తవ్వకాలు జరపాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు గతంలో వార్తలు రాగా.. వివాదం చెలరేగింది. అయితే, ఈ వార్తలను సాంస్కృతిక శాఖ మంత్రి ఖండించారు. అలాంటి నిర్ణయం తేసుకోలేదని చెప్పారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో పాటు పలువురు ఏఎస్ఐ అధికారుల బృందం సందర్శించిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, కుతుబ్ మినార్ చుట్టూ జైన, హిందు దేవాలయాల్లోని విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోందని ఓ అధికారి వెల్లడించారు.