మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరమయ్యారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లో ఉండనున్నారు. మరి కొన్ని గంటల్లో పాదయాత్ర ప్రారంభకానున్న తరుణంలో రేవంత్ రెడ్డి దూరం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శనివారం మొదలుపెట్టిన పాదయాత్రలో భాగంగా నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న పాదయాత్ర రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే మొదలు కావాల్సి ఉంది. ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కాగా రేవంత్ రెడ్డి కూడా యాత్రకు పార్టీ నేతలను ఆహ్వానిస్తూ వచ్చారు. యాత్రకు రానన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు కూడా చెప్పారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. యాత్రకు రాలేనని, అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ నేతలు, శ్రేణులకు సందేశం పంపారు.