తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం చంచల్గూడ జైలుకు వెళ్లారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి చంచల్గూడ జైలుకు వెళ్లిన రాహుల్ గాంధీ ఎన్ఎస్యూఐ నేతలను ఆయన కలిశారు. అరెస్టులకు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని వారికి రాహుల్ భరోసా ఇచ్చారు. చంచల్గూడ జైలు సందర్శనలో భాగంగా రాహుల్ వెంట మల్లు భట్టి విక్రమార్క మినహా మరెవ్వరినీ పోలీసులు జైలులోకి అనుమతించలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అనుమతించలేదు.
టీపీసీసీ తరఫున చంచల్గూడ జైలు సందర్శనకు రాహుల్కు అనుమతివ్వాలంటూ రేవంత్ ఓ లేఖ రాశారు. ఆ లేఖకు జైళ్ల శాఖ సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ నుంచి తెలంగాణ జైళ్ల శాఖకు అందింది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంతకంతో వచ్చిన ఆ లేఖతో ఎట్టకేలకు జైళ్ల శాఖ రాహుల్ జైలు సందర్శనకు అనుమతించింది. అయితే ఆ లేఖలో మాణిక్కం ఠాగూర్.. జైలు లోపలికి రాహుల్తో పాటు భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించాలని కోరారట. రేవంత్ పేరును ప్రస్తావించకపోవడంతో రాహుల్ గాంధీ వెంట చంచల్ గూడ జైల్లోకి ఒక్క భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించారు పోలీసులు.