డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూపీఐ అకౌంట్లకు క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకునేలా అనుమతి కల్పించనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. నేడు ప్రకటించిన మానిటరీ పాలసీలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేశారు.
దేశీయ రూపే క్రెడిట్ కార్డులను తొలుత యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకునేలా అనుమతి ఇస్తామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆ తర్వాత మాస్టర్కార్డు, వీసా వంటి ఇతర క్రెడిట్ కార్డులను కూడా యూపీఐ అకౌంట్లకు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు యూపీఐ అకౌంట్లకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే అనుమతి కస్టమర్లకు ఉండేది. తాజాగా ఈ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్లు మరింత పుంజుకోనున్నాయి. కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా ఈ పేమెంట్లను చేసుకోనున్నారు.
‘యూజర్లు ప్రస్తుతం డెబిట్ కార్డులను వారి సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను యూపీఐకి లింక్ చేసుకోవడం ద్వారా లావాదేవీలు చేసుకునేందుకు వీలుంటుంది. ఇక నుంచి యూపీఐ ప్లాట్ఫామ్కి క్రెడిట్ కార్డులను లింక్ చేసే ప్రతిపాదనను తీసుకొస్తున్నాం. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తామని ఆర్బీఐ తెలిపింది. అయితే క్రెడిట్ కార్డులను వాడుతూ యూపీఐ లావాదేవీలు చేసినందుకు మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఎలా అప్లయి అవుతుందో మాత్రం స్పష్టత లేదు. ప్రతి లావాదేవీకి మర్చెంట్లు ట్రాన్సాక్షన్ మొత్తంపై కాస్త పర్సంటేజ్ను బ్యాంకులకు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు చెల్లించాల్సి ఉండేది. కానీ జనవరి 1, 2020 నుంచి తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, యూపీఐ, రూపే కార్డులకు జీరో-ఎండీఆర్ అమల్లోకి వచ్చింది. అంటే రూపే కార్డుల ద్వారా యూపీఐ లావాదేవీలు చేపడితే ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న మర్చెంట్లు యూపీఐ లావాదేవీలను వాడేందుకు ఆర్బీఐ దీన్ని తీసుకొచ్చింది.
2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ డిజిటల్ పేమెంట్స్లో 60 శాతం వరకు యూపీఐ ద్వారానే జరిగాయి. వీటి లావాదేవీల విలువ లక్ష కోట్ల డాలర్ల మార్కును చేధించింది. మరోవైపు క్రెడిట్ కార్డులపై ఎండీఆర్ ఛార్జీలు భారీగా రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటున్నాయి. ప్రస్తుతం వీటిని యూపీఐకి లింక్ చేయడం ద్వారా ఈ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు ఉంటాయా..? ఉండవా..? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.