భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషిగా ఉన్న పెరరివాలన్కు విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది.
పెరరివాలన్ కుటుంబ సభ్యులతో పాటు అనేక తమిళ అనుకూల సంస్థలు హర్షధ్వానాలతో ఈ తీర్పును స్వాగతించాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ సైతం స్పందించారు. రాజీవ్ గాంధీ హంతకుడు పెరరివాలన్ విడుదల కావడం తమిళనాడుకు ఘనవిజయం అంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజీవ్ హత్య కేసులో పెరరివాలన్.. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలోనే తన శిక్షను మినహాయించాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే, ఆయన విడుదలలో జాప్యం జరుగుతుందని పెరరివాలన్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. రాజీవ్ గాంధీ హంతకుడు పెరరివాలన్ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి దక్కిన భారీ విజయమని అన్నారు . పెరారివాలన్ 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని స్టాలిన్ అన్నారు. ఇప్పుడు అతను స్వేచ్ఛ గాలిని తీసుకోబోతున్నాడని తెలిపారు. రాష్ట్ర హక్కుల కోసం కూడా ఇది భారీ విజయమని అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏజీ పీరరివాలన్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు అభినందనలు తెలిపారు. 31 ఏళ్ల జైలు జీవితం గడిపిన పెరారివాలన్ ఎట్టకేలకు స్వేచ్ఛా గాలి పీల్చుకోగలిగారని స్టాలిన్ అన్నారు.
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు గతంలో వారిని దోషులుగా నిర్ధారించిందని కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు వారు చట్టబద్ధత ఆధారంగా పెరరివాలన్ను విడుదల చేశారని మండిపడింది. తాము సుప్రీంకోర్టు తీర్పును విమర్శించాలనుకోవడం లేదని.. కానీ దోషులు హంతకులు అని, వారు నిర్దోషులు కాదని మేము నొక్కి చెప్పాలనుకుంటున్నామని తెలిపారు.
కాగా, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 21, 1991 రాత్రి 10.20 గంటలకు శ్రీపెరంబుదూర్లో హత్యకు గురయ్యారు. అప్పటికి 19 ఏళ్ల వయస్సు ఉన్న జి పెరరివాలన్ను జూన్ 11న సిబిఐ అరెస్టు చేసింది. అతనిపై తీవ్రవాదం, విధ్వంసక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేయబడింది. అనేక విచారణల తర్వాత ఆయన్ను దోషిగా తేల్చారు.
Last Updated May 18, 2022, 3:06 PM IST