అంద‌రి పిల్ల‌లు తాగుతారంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు విన్నారా..?

0
736

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ తన భర్త ఉమైద్ సింగ్ రాథోడ్‌తో కలిసి ధర్నా చేస్తూ కనిపించారు. అంతేకాకుండా పోలీసులతో ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసు స్టేషన్‌లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదంతా మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేసిన తన బంధువులను విడిపించుకోడానికి చేసిన హంగామా అని స్పష్టంగా తెలుస్తోంది.

జోధ్‌పూర్‌కు చెందిన పోలీసులు ఆదివారం రాత్రి డ్రంక‌న్ డ్రైవ్ నిర్వ‌హించ‌గా ప‌లువురు తాగి వాహ‌నాలు న‌డుపుతూ ప‌ట్టుబ‌డ్డారు. వాళ్ల‌లో రాజ‌స్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా క‌న్వ‌ర్ మేన‌ల్లుడు కూడా ఉన్నాడు. అధికారులు ఎమ్మెల్యే బంధువులను అరెస్టు చేశారు.. మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపినందుకు చలాన్ జారీ చేశారు. ఎమ్మెల్యే బంధువుల వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఆమె తన బంధువులకు మద్దతు తెలపడానికి వచ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. నిందితులంద‌రితో పాటు పోలీసులు ఎమ్మెల్యే మీనా క‌న్వ‌ర్ మేన‌ల్లుడిని కూడా స్టేష‌న్‌కు త‌ర‌లించడంతో ఆమె త‌న భ‌ర్త‌, అనుచ‌రుల‌తో క‌లిసి స్టేష‌న్‌కు వెళ్లారు. త‌న మేన‌ల్లుడిని విడిచిపెట్టాల‌ని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినక‌పోవ‌డంతో స్టేష‌న్లోనే బైఠాయించి ధ‌ర్నాకు దిగారు. ‘పిల్లలు అన్న‌ప్పుడు తాగుతారు. అంద‌రి పిల్ల‌లు తాగుతారు. అంత మాత్రానికే అరెస్ట్ చేస్తారా..?’ అని మీనా క‌న్వ‌ర్ వ్యాఖ్యలు చేశారు. త‌న మేన‌ల్లుడిని వెంట‌నే వ‌దిలిపెట్టాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది.