వర్మపై విరుచుకుపడ్డ రాజా సింగ్

0
784

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున బరిలోకి దిగిన ద్రౌపతి ముర్మును ఉద్దేశించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అని అన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత స్థానానికి ఎన్నికవుతున్న తరుణంలో ఇలాంటి ట్వీట్ బాధను కలిగించిందని చెప్పారు.

వర్మ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై వర్మ చవకబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని.. ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని, లక్ష్మణరేఖ దాటొద్దని స్పష్టం చేశారు.

తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. భారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని, ఆ పేరు చాలా అరుదుగా ఉంటుందని అన్నారు. అందుకే, ఆ పేరు తెరపైకి రాగానే, ఆ పేరుతో ముడిపడిన అనేక అంశాలు జ్ఞప్తికి వచ్చాయని వర్మ వివరించారు. ఆ కోణంలోనే తన అభిప్రాయాలను వెల్లడించానని, అంతేతప్ప ఎవరి మనోభావాలను గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు. రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.