జైశ్రీరామ్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కొత్త భాష్యం చెప్పాడు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో జరిగిన సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అంటే అది సీతామాతను గుర్తించకపోవడమేనంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. ‘జై శ్రీరామ్’ కంటే కూడా ‘జై సియారామ్’ అని నినదించాలని హితబోధ చేశాడు. బీజేపీ వాళ్ళు కేవలం జై శ్రీరామ్ అని మాత్రమే అంటారనీ,.. వారు ఎప్పుడూ కూడా జై సియారామ్ అని అనలేదని అన్నాడు. ఆరెస్సెస్, బీజేపీలకు స్త్రీలంటే గౌరవమే లేదనీ,.. అందుకే వారు కేవలం జై శ్రీరామ్ అని మాత్రమే నినాదాలు చేస్తారని చెప్పాడు. అయితే కాంగ్రెస్ నాయకులందరూ కూడా జై సియారాం అని అంటామనీ,.. అంటే తాము రాముడితో సమానంగా సీతమ్మను కూడా గౌరవిస్తామని,.. దాని అంతరార్థమని చెప్పుకొచ్చాడు. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ చెలరేగింది. పలువురు ఆసక్తికర చర్చను లేవనెత్తారు. సోషల్ మీడియా యుగంలో సామాన్యులకు కూడా చర్చించే అవకాశం కలగటంతో ఈ వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా 2019లో ఇస్కాన్ చేసిన ట్వీట్ను తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ట్వీట్లో ఇస్కాన్ జై శ్రీరామ్ నినాదం గురించి క్షుప్తంగా వివరించింది. భారతీయ ఇతిహాసాల ప్రకారం చూస్తే జై శ్రీరామ్ అన్నా,.. జై సియారామ్ అన్నా.. ఒకటేనని స్పష్టం చేసింది. సంస్కృత డిక్షనరీ ప్రకారం జై శ్రీరామ్ లో ‘శ్రీ’ అనే పదం మహిళను సూచిస్తుందని తెలిపింది. అంటే సాధారణంగా మహిళలకు శ్రీమతి అనే పదాన్ని ఉపయోగిస్తారనీ,.. జై శ్రీరామ్లో కూడా ‘శ్రీ’ అనేది సీతామాతను సూచిస్తుందని ఇస్కాన్ సంస్థ వివరించింది.
ఇక ఇతిహాసాల సంగతి అటుంచితే,.. రాహుల్ గాంధీ విమర్శలకు కూడా ప్రతి విమర్శలకు దీటుగానే వినిపిస్తున్నాయి. బీజేపీ వారు జై సీతారాం అని అనరంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు అంతే దీటుగా సమాధానమిస్తున్నాయి. గతంలో ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో పర్యటించినప్పుడు.. జై సీతారామ్ అని నినదించిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు జత చేస్తూ,.. ఇంకెన్నాళ్ళు ఇలా అబద్దాలను ప్రచారం చేస్తారని విమర్శిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ ఆరెస్సెస్లో మహిళలకు ప్రాధాన్యత లేదనే దానికి కూడా దీటుగా సమాధానమిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, మీనాక్షి లేఖిలాంటి వారికి బీజేపీ సముచిత స్థానమిచ్చిందని గుర్తు చేస్తున్నారు. వీరంతా దేశంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఆరెస్సెస్లో కూడా మహిళల కోసం ‘రాష్ట్రీయ స్వయం సేవికా సమితి’ అనే ప్రత్యేక విభాగముందని గుర్తు చేస్తున్నారు. ఈ విభాగంలో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారనీ,.. విమర్శలు చేసేముందు అన్నీ తెలుసుకోవాలనీ,.. ఆ తర్వాతే విమర్శించడం నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.
అయితే రాహుల్ గాంధీ చెబుతున్నట్టుగా జై శ్రీరామ్, అన్నా జై సియారామ్ అన్నా.. అది ఆ సీతారాముల వారికే చెందుతుంది కదా..! అని పలువురు వేద పండితులు చెబుతున్నారు. హనుమాన్ ఆలయానికి వెళ్ళి జై వీరహనుమాన్ అనేనినాదాలు చేసినా హనుమంతుడి ప్రకారం అది ఆ సీతారాములకే చెందుతుందంటున్నారు. ఈ విధంగా సీతారాములను తలచుకుని చేసే ఏ నినాదమైనా అది ఆ దేవీదేవతలకే చెందుతుంది. అయితే ఇంతటి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అని రాహుల్ గాంధీని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు శ్రీరాముడే లేడని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు,.. ఇప్పుడు జై సియారామ్ అని నినదించినా లాభమేముంటుందనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఇక జై శ్రీరామ్ నినాదాలపై చర్చ లేవనెత్తిన రాహుల్ గాంధీ విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మరి, ఈ విమర్శలకు గట్టిగా సమాధానం చెబుతారో,.. లేక వివాదం రేపడమే మాత్రమే తమ అని.. అని తప్పించుకుంటారో చూడాలి.