ప్రధాని నరేంద్రమోదీ ఏపీలోని భీమవరం పర్యటనకు రఘురామకృష్ణరాజు హాజరుకాలేకపోయారు. హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బయల్దేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. బేగంపేట రైల్వేస్టేషన్లో ఆయన దిగిపోయారు.
తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలపై రఘురామ ఓ వీడియోను విడుదల చేశారు. భీమవరంలో తన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని రఘురామ చెప్పారు. తాను వెళ్తే ఇంకా ఇబ్బంది పెడతామని వారికి చెబుతున్నారు. భీమవరం వెళ్లకపోతే వాళ్లను వదిలేస్తామని పోలీసులు చెప్పడంతో.. తన పర్యటనను వాయిదా వేసుకున్నానని అన్నారు. తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి ఒక అడుగు వెనక్కి వేయదలుచుకున్నానన్నారు రఘురామ. అంతేకాకుండా తనను చంపేందుకు ప్రొఫెషనల్ కిల్లర్ ను నియమించారని.. తన హత్యకు ప్లాన్ చేశారని రఘురామ ఆరోపించారు. తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. విజయవాడ నుంచి అతడు వచ్చినట్లు చెప్పాడని.. అతడి పేరు సుభాన్ అలియాస్ బాష అని తెలిపారు. మొత్తం ఆరుగురు దుండగులు వచ్చారని.. అందులో ఒకరిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు రఘురామ సిబ్బంది చెప్పారు.