ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలయి ఏడాది కావస్తోంది. రష్యా దాడులను సైతం లెక్క చేయకుండా ఉక్రెయిన్ పోరు కొనసాగిస్తోంది. ఐతే ఇతర దేశాల సాయంతో ఉక్రెయిన్ వార్ కొనసాగిస్తోంది. ఇలాంటి తరుణంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని.. ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి పుతిన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా.. 91 వేలమంది జర్మన్ బలగాలను బంధించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధగతిని మార్చింది. ఈ స్టాలిన్ గ్రాడ్ను ప్రస్తుతం వొల్గొగ్రాడ్గా వ్యవహరిస్తున్నారు.
అమెరికా 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు, జర్మనీ 14 లెపర్డ్ 2 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్కు అందిస్తుండటంపై పుతిన్ మండిపడ్డారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము మా ట్యాంకులను వారి సరిహద్దుల్లోకి పంపడం లేదని.. కానీ, వారిని ఎదుర్కొనే మార్గాలున్నాయన్నారు. యుద్ధం ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తూ ఆధునిక ముసుగులో నాజీ భావజాలాన్ని చూస్తున్నామని.. అది మరోసారి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిందన్నారు. పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదిరించాలని.. జర్మనీ ట్యాంకులతో రష్యాకు ముప్పు ఉందనేది నమ్మలేని నిజమని పుతిన్ వెల్లడించారు. అయితే, రష్యా తన భద్రతకు ప్రమాదంగా మారిన వాటికి గతంలో తగిన సమాధానం కూడా చెప్పిందని పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా జర్మనీని ఉద్దేశించి పుతిన్ హెచ్చరించారు.
అలాగే యూరోపియన్ యూనియన్కు చెందిన పలువురు అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. వీరిలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఛార్లెస్ మైఖెల్, 15 మంది యూరోపియన్ కమిషనర్లు ఉన్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు సహకరిస్తామని తెలిపేందుకు, అలాగే ఈయూలోనూ, నాటోలోను ఆ దేశం చేరికపై వారు చర్చించారు. మరోపక్క తమ దేశానికి చెందిన పాత తరం లెపర్డ్ 1 యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్కు అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్టెఫెన్ హెబెస్ట్రిట్ స్పష్టం చేశారు. అయితే ఎన్ని ట్యాంకులను పంపబోయేది ఆయన వివరించలేదు.
ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్తో సన్నిహిత సంబంధాలు గల వాగ్నర్ గ్రూప్ను కల్లోలిత లిబియా, సూడాన్ల నుంచి బహిష్కరించేందుకు అమెరికా తన చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజిప్టు, యూఏఈలతో సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా సూడాన్, లిబియాల్లోని సైనిక నేతలపై ఆ గ్రూపుతో సంబంధాలు తెంచుకునేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కొన్ని నెలల క్రితమే వాగ్నర్ గ్రూప్పై అమెరికా పలు ఆంక్షలను విధించింది. కిరాయి సైనికులతో నడిచే ఈ గ్రూపు రష్యా ఒలిగార్క్ యెవ్జెనీ ప్రిగోఝిన్కు చెందినది. ఆయన పుతిన్కు అత్యంత సన్నిహితుడు. ఐతే అమెరికా సాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం గెలవాలనే ఆశ ఎంత వరకు నెరవేరుతుందో అనే ప్రశ్నలు తలేత్తుతున్నాయి. ఈ యుద్ధం కాస్త మరికొన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.