అగ్నిపథ్ స్కీంపై ఆప్ ప్రభుత్వం అక్కసును వెళ్లగక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నీపథ్ రక్షణ నియామక పథకానికి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా పంజాబ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం జరిగిన చర్చలో సీఎం మాన్ మాట్లాడుతూ దేశ యువతకు ఈ పథకం వ్యతిరేకమని అన్నారు. అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి వరకు తొందరలోనే వెళ్తుందని అన్నారు.
మాన్ తీర్మానానికి బీజేపీ మినహా విపక్ష పార్టీలన్నింటి నుంచి మద్దతు లభించింది. విపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ బజ్వా ఈ విషయమై మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి తాము సైతం బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు అకాలీదళ్ నేత మన్ప్రీత్ సింగ్ అయాలీ ప్రకటించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల నిరసనకారులు రైళ్లు తగలబెట్టారు. ఈ ఘటనల్లో కొంత మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.