కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలను వాయిదా వేశారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్కుమార్ అంత్యక్రియలను అక్టోబర్ 31, ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్సైట్ను,యాప్ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్ను లాంచ్ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు.
పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దర్శించుకున్నారు. తన మిత్రుడు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. పునీత్ భౌతిక కాయాన్ని చూసి ఎన్టీఆర్ భావోద్వేగాలకు గురయ్యారు. ఎన్టీఆర్ పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్ ను చూడగానే శివరాజ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో ‘గెళయా గెళయా’ అనే పాటను ఎన్టీఆర్ పాడారు. పునీత్, ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. పునీత్ హఠాన్మరణం చెందారన్న వార్తను ఎన్టీఆర్ నమ్మలేకపోయానని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.