కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పులిచింతల డ్యామ్ నుంచి నీళ్లు వదులుతుండగా ఓ గేట్ ఊడిపోవడమే..! 16వ నంబర్ గేటు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వృథాగా పోతోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. 16వ నంబరు క్రస్ట్ గేట్ నీటి ప్రవహానికి కొట్టుకుపోయింది. వేకువజామున ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో అధికారులు కొంతమేర గేటు పైకి ఎత్తారు. గేట్లు ఎత్తే క్రమంలో గాటర్స్లో మెకానికల్ తేడాతో గేటు ఊడి పడింది. ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీలుపడలేదు. వెంటనే అధికారులు 16వ గేటు సహా 11,13,14,18,19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గేటు విరిపోగిపోవడం డ్యామ్ మీదుగా రాకపోకలను నిలిపేశారు.
వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేశారు. 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారని కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందుకు డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందన్నారు. లేకపోతే నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉందని.. ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనుందని అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు,వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలెవరూ నదిలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పిల్లలు ,ముసలి వాళ్ళు లోతట్టు ప్రాంతాల నుంచి తరలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉండడంతో కొత్త గేటు అమర్చే పరిస్థితులు లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్లాక్ పరిజ్ఞానంతో నీరు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నాలు జరపాలని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. పులిచింతల ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 44.53 టీఎంసీలుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 174.14 అడుగులు ఉంది.