హైదరాబాద్లో లైంగిక దాడికి గురైన చిన్నారి చదువుతున్న డీఏవీ స్కూలు గుర్తింపును వెంటనే రద్దు చేయాలని సూచిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై హైదరాబాద్ డీఈవోకు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా, మిగతా పాఠశాలల్లో సీట్లు కేటాయించేలా చూడాలని కూడా ఆమె సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల సందేహాల్ని తొలగించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. పాఠశాలల్లో భద్రతాపరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ రజనీ కుమార్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. స్కూలు ప్రిన్సిపల్ మాధవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన డ్రైవర్ ఆకృత్యానికి పాల్పడుతున్నా అడ్డుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఘటన జరగడానికి కారణమయ్యారనే ఆరోపణలపై ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.