కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో కౌశిక్ రెడ్డి విషయంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! కాల్ రికార్డింగ్ లీక్ అవ్వడం.. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేయడం.. ఇలా చకచకా జరిగిపోయాయి. తాజాగా కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి సాయినాథ్ రెడ్డి పని చేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. “రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్రెడ్డి తెరాసలోకి వచ్చారు. యువనేత కౌశిక్రెడ్డి తెరాసలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. కౌశిక్రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడిపోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని.. శాశ్వతంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదని చెప్పారు. ఎప్పుడూ అధికారంలో ఉండటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని.. టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని” కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కౌశిక్ రెడ్డి బాధ్యతలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పదవిలో ఉన్నప్పుడే ఆయన ‘తెరాస టికెట్ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.