మధుర కవితాశిల్పి దేవులపల్లి!

0
804
మధుర కవితాశిల్పి దేవులపల్లి!
మధుర కవితాశిల్పి దేవులపల్లి!

(నేడు నవంబర్ 1 కృష్ణశాస్త్రి జయంతి )

”నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు. విశ్వనాథ సత్యనారాయణ – మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా అభిప్రాయం” అంటారు మహాకవి శ్రీశ్రీ
అంతటి మధుర కవితాశిల్పి దేవులపల్లి కృష్ణశాస్త్రిది తెలుగు భావ కవితా రంగంలో ఒక ముఖ్య అధ్యాయం. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్త్రి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి ఆయన. రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మించారు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నారు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరారు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు. ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించారు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే “ఊర్వశి” అనే కావ్యం వ్రాశారు. 1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించారు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్త్రి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి. ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు …దేవులపల్లి కృష్ణశాస్త్రి. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని ఆయన రచనా పరంపర కొనసాగింది. ఆయన కి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు.
కృష్ణశాస్త్రికి లభించిన పురస్కారాలు లెక్కకు మించే ఉంటాయి. 1975 – ఆంధ్ర విశ్వవిద్యాలయం – కళాప్రపూర్ణ, 1978 – సాహిత్య అకాడమీ అవార్డు, 1976 – పద్మ భూషణ్ ముఖ్యమైనవి.
కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ కృష్ణ పక్షము ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
ఊర్వశి కావ్యము, అమృతవీణ – 1992 – గేయమాలిక, అమూల్యాభిప్రాయాలు – వ్యాసావళి, బహుకాల దర్శనం – నాటికలు,కథలు, ధనుర్దాసు – నాలుగు భక్తీ నాటికలు, కృష్ణశాస్త్రి వ్యాసావళి – 4 భాగాలు, మంగళకాహళి – దేశభక్తి గీతాలు, శర్మిష్ఠ – 6 శ్రవ్య (రేడియో) నాటికలు
శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993, మేఘమాల – సినిమా పాటల సంకలనం – 1996, శ్రీ విద్యావతి – శృంగార నాటికలు, యక్షగానాలు – అతిథిశాల – సంగీత రూపకాలు మహాతి వెండితెర పాటలు – 2008.
మల్లీశ్వరితో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు సీతామాలక్ష్మి – మావి చిగురు తినగానే కోయిల పలికేనా, మేఘ సందేశం – ఆకులో ఆకునై, పూవులో పూవునై.., , గోరింటాకు – గోరింట పూచింది కొమ్మ లేకుండా, కార్తీక దీపం – ఆరనీకుమా ఈ దీపం, కృష్ణ పక్షము, మల్లీశ్వరి – మనసున మల్లెల మాలలూగెనే, జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ అనే గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విద్యార్థుల కోసం వ్రాసారు.
కృష్ణపక్షము నుండి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
కాలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (స్వేచ్ఛాగానము)

తలిరాకు జొంపముల సం
దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో
మల రేఖవొ! పువుదీవవొ!
వెలదీ, యెవ్వతెవు నీపవిటపీ వనిలోన్ ? (అన్వేషణము)

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? (ఏల ప్రేమింతును?)

పిలచిన బిగువటరా, — మనసున మల్లెల మాలలు, — నోమి నమ్మాల్లాలా — ఆకాశ వీధిలో హాయిగా — ఔనా.. నిజమేనా? —- పరుగులు తీయాలి – మల్లీశ్వరి (1951), సడి సేయకో గాలి – రాజ మకుటం (1961), ప్రతి రాత్రి వసంత రాత్రి – ఏకవీర (1969), రానిక నీకోసం. . సఖీ – మాయని మమత (1970), ఈ గంగ కెంత దిగులు – శ్రీరామ పట్టాభిషేకం (1978), నేటికి మళ్ళి మా ఇంట్లో – వాడే వీడు (1973), ముందు తెలిసినా ప్రభూ — ఆకులో ఆకునై — మేఘ సందేశం (1982), ఆరనీకుమా ఈ దీపం – కార్తీక దీపం (1979), గోరింట పూచింది — ఎలా ఎలా.. దాచావు? – గోరింటాకు (1979), పగలైతే దొరవేరా —- మనిషే మారేరా.. రాజా – బంగారు పంజరం (1969), సరిగమపదనిసా..పలికే వారుంటే – కళ్యాణ మండపం (1971), గట్టుకాడ ఎవరో – బంగారు పంజరం (1969), ఒక్క క్షణం ఒక్క క్షణం – కలసిన మనసులు (1968)
కుశలమా.. నీకు కుశలమేనా – బలిపీఠం (1975), చాలులే నిదురపో — చుక్కలతో చెప్పాలని.. — అడుగడుగున గుడి ఉంది —- రావమ్మా మహాలక్ష్మి.. – ఉండమ్మా బొట్టు పెడతా – (1968), మనిషైతే మనసుంటే – అమాయకుడు (1968), నా పేరు బికారి — ఆకాశ పందిరిలో – శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976), ఎవరు నేర్పేరమ్మ… ఈ కొమ్మకు – ఈనాటి బంధం ఏనాటిదో (1977), వేళ చూస్తే.. సందె వేళ – జగత్ కిలాడీలు (1969), చీకటి వెలుగుల కౌగిటిలో – చీకటి వెలుగులు (1975), పాడనా తెనుగు పాట – అమెరికా అమ్మాయి (1976), ఇది మల్లెల వేళయనీ – సుఖదుఃఖాలు (1968), మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి (1978), నామాల తాతయ్యే నీకు నాకు అందరికీ – నామాల తాతయ్య (1979), దూరాన దూరాన తారా దీపం…. – మా బంగారక్క (1977), ఎవరైనా చూశారా? – అమ్మ మాట (1972), కొలువైతివా రంగ సాయి – ఆనంద భైరవి (1984), ఘనా ఘనా సుందరా.. – భక్త తుకారాం (1973), రామా.. ఓ.. రామా – రాముడే దేముడు (1973) ఇలా .. ఎన్నో ఎన్నెన్నో ఆయన కలం నుంచి జాలు వారిన మధుర గీతాలను మనం ఎలా మరచి పోగలం!?

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

14 + twenty =