ఏపీ నవంబర్ 27 నుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వార్తలు ప్రజలను టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే ముప్పు తప్పిందని భావిస్తూ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపుగా ప్రయాణిస్తోంది. దీంతో రాయలసీమకు వర్షం ముప్పు తప్పినట్టేనని వాతావరణశాఖ తెలిపింది.ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని తొలుత అంచనా వేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడది ఆవర్తనంలానే ఉంటూ శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతోంది. ఫలితంగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం అటువైపుగా వెళ్లిపోవడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో మాత్రం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.
అయితే మరో అల్పపీడనం రూపంలో ముప్పు పొంచి ఉంది. ఈనెల 29నాటికి దక్షిణ అండమాన్ దగ్గర బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అంచనా వేస్తున్నారు. 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో 26న ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి మోస్తరు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 27న ఉత్తర కోస్తాలో తేలికపాటి వానలతోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడనున్నాయి. 28న రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. 28, 29న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉంది.