తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో నిందితురాలైన నిహారిక జైలు నుంచి విడుదల అయింది. ఈ కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారికకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిహారికా చర్లపల్లి జైలు నుంచి విడుదల అయింది. ఫిబ్రవరి 6న నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించిన అతని స్నేహితుడు హసన్, నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన విషయాన్ని దాచి, హత్యకు సహకరించినందుకు గానూ నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని హయత్ నగర్ కోర్ట్ లో హాజరు పరుచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇటీవల బెయిల్ కోసం నిహారిక దరఖాస్తు చేసుకోగా శనివారం ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నవీన్ను హత్య చేసిన తర్వాత ప్రియుడు హరికి ఆన్లైన్లో రూ.1500 డబ్బులు నిహారిక పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఛార్జీల కోసమని నిహారిక పంపినట్లు తేలింది. ఇక నిహారిక కోసమే తాను నవీన్ను చంపినట్లు హరిహరకృష్ణ విచారణలో తెలిపాడు. హత్య చేసిన తర్వాత నవీన్ శరీరాన్ని ముక్కలుగా కోసి గుండె, ఇతర శరీర భాగాలను ఫొటో తీసి నిహారికకు వాట్సాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లో సమాచారాన్ని డిలీట్ చేసినందుకు హాసన్, నిహారికలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నవీన్ హత్యలో వారిద్దరి పాత్రపై పోలీసులు ప్రశ్నించారు.