తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించింది. తెలంగాణలోని మావోయిస్టు సానుభూతిపరుల నుంచి ఎన్ఐఏ అధికారులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి రాష్ట్రంలోని జనగామ, భద్రాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లో పలువురు మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.
ఈ సెర్చ్ ఆపరేషన్ లో 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 400 జిలెటిన్ స్టిక్స్ 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 549 మీటర్ల ఫ్యూజు వైర్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఐఈడీ, గ్రెనేడ్ లాంచర్ల తయారీ కోసం వాడే సామగ్రి, వాటికి సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో సహా పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించినట్లు అనుమానించబడిన లోహపు వస్తువులను, నాణేలను ఎన్.ఐ.ఏ. స్వాధీనం చేసుకుంది.
మేడ్చల్ లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రిలో గుంజి విక్రమ్, త్రినాథరావు, మహబూబ్ నగర్ జిల్లాలోని ముత్తు నాగరాజు, వి.సతీశ్, వరంగల్ లో వేలుపు స్వామి, జనగామలోని సూర సారయ్యల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఛత్తీస్గఘడ్ లో మావోయిస్టుల నుండి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో తెలంగాణ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసు మొదట్లో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో నమోదైంది. తరువాత ఎన్ఐఏ మేలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మహబూబ్నగర్కు చెందిన ఎం. నాగరాజు, మేడ్చల్ కు చెందిన కె కనకయ్య అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, ఫ్యూజ్ వైర్లను దుమ్ముగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.