హైదరాబాద్లోని హెచ్ఐసీసీ కేంద్రంగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రెండో రోజు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసోం, కర్ణాటక సీఎంలు హిమంత బిశ్వ శర్మ, బసవరాజ్ బొమ్మైలు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఈ తీర్మానంలో అమిత్ షా పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. కొత్తగా తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని సదరు తీర్మానంలో అమిత్ షా ప్రతిపాదించారు. కేరళ, ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని.. బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూడదని, దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏకదృష్టితోనే చూస్తుందని అమిత్ షా ఆ తీర్మానంలో చెప్పుకొచ్చారు. దేశంలో అన్ని వర్గాలకు బీజేపీ చేరువ కావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంతో పాటు రాష్ట్రాల్లో 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. ఇందుకోసం కార్యాచరణ తయారు చేయాలని అమిత్ షా సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. పటేల్ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉందని ప్రధాని అన్నారు. 119 నియోజకవర్గాలకు వెళ్లిన జాతీయ ప్రతినిధులను మోదీ అభినందించారు. యూపీ ఉప ఎన్నికల విజయం స్ఫూర్తితో పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాలకు బీజేపీ చేరువ కావాలన్నారు.