మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈవో పదవికి గుడ్బై చెప్పేశారు. భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (45) కొత్త సీఈవోగా నియమితులయ్యారు. అగర్వాల్ ప్రస్తుతం ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫసర్ (సీటీవో)గా ఉన్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్ఫోర్డ్లో పీహెచ్డీ చేసిన వ్యక్తి పరాగ్ అగర్వాల్. ఈ పదవిని చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పరాగ్ అగర్వాల్ చెప్పారు. పరాగ్ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్టు జాక్ డోర్సే చెప్పారు. కంపెనీ అవసరాలను అతడు లోతుగా అర్థం చేసుకున్నాడని, ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అతడు ఉన్నాడని అన్నారు. పరాగ్లో ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయని అన్నారు. సీఈవోగా పరాగ్ అగర్వాల్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. సీఈవో పదవి నుంచి తప్పుకున్న డోర్సే 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు ట్విట్టర్ బోర్డులోనే కొనసాగుతారు.
ఐఐటీ బాంబే, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి పరాగ్ అగర్వాల్. పదేండ్ల క్రితం ట్విట్టర్లో యాడ్స్ ఇంజినీర్గా చేరారు. 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతి అయ్యారు. గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లోనూ పనిచేశారు. దాదాపు 16 సంవత్సరాల అనంతరం ట్విట్టర్ సంస్థకు కొత్త సీఈవో రాగా, అదికూడా ఓ భారతీయుడికి అవకాశం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.