ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలను వర్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 13 జిల్లాలు ఇప్పుడు 26గా మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా.. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుందని, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా, మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదన్నదే తమ లక్ష్యమని వైసీపీ నేతలు అంటున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఆర్డర్ టు సెర్వ్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు కూడా విధుల్లో చేరనున్నారు. 9.45 గంటలలోపు అధికారులు, ఉద్యోగులు కొత్త జిల్లా కేంద్రాల్లో విధుల్లోకి చేరారు. పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలను ముస్తాబు చేశారు. 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు. లోక్ సభ నియోజకం ప్రామాణికంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇకపై రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది.