భారత త్రివిధ దళాల నూతన అధిపతి (సీడీఎస్)గా లెఫ్ట్నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్ జనరల్ హోదాలో పనిచేసిన అనిల్, ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఆయనను కేంద్ర ప్రభుత్వం నూతన సీడీఎస్గా నియమించింది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నాడు సీడీఎస్గా ఉన్న బిపిన్ రావత్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బిపిన్ రావత్ మరణం తర్వాత సీడీఎస్ పోస్టు ఖాళీగానే ఉంది. ఆ స్థానాన్ని అనిల్ చౌహాన్తో కేంద్రం భర్తీ చేసింది.
హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను దేశ అత్యున్నత సైనిక అధికారిగా నియమించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ మే 2021లో ఈస్టర్న్ కమాండ్ చీఫ్గా పదవీ విరమణ చేశారు. అనిల్ చౌహాన్ జమ్మూ కశ్మీర్, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో భాగమై ఉన్నారు. ఇప్పుడు త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.