హంగేరి.. బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్స్ జావెలిన్ని 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్, డైమండ్ లీగ్ ట్రోఫీ, వరల్డ్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడల్తో సహా అన్ని గ్లోబల్ మెడల్స్ను సాధించాడు.
క్వాలిఫైయర్స్లో నీరజ్ 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ లో తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో జావెలిన్ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్లో 3 మంది భారతీయులు ఫైనల్కు చేరుకోవడం ఇదే మొదటిసారి. కిషోర్ జెనా, డీపీ మను కూడా రాణించడం విశేషం. ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. 86.67 మీటర్ల దూరం విసిరిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లెచ్ కాంస్య పతకం సాధించాడు.
మహిళల లాంగ్ జంప్లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకం, గత ఏడాది యూజీన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో నీరజ్ రజత పతకం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారతదేశానికి 3వ పతకం కావడం విశేషం.