భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో ఫోన్లో సంభాషించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంపై తామిద్దరూ చర్చించుకున్నట్లు రాజ్నాథ్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆఫ్ఘనిస్థాన్ సహా పలు అంశాలపై కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తమ మధ్య సంభాషణ బాగా జరిగిందని, కొన్ని ప్రాంతీయ అంశాలపై కూడా మాట్లాడుకున్నామని రాజ్నాథ్ వెల్లడించారు. ఇరుదేశాలకు లాభదాయకమైన విషయాలపై చర్చించుకోవడంతోపాటు, తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు అంగీకారం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాజ్నాథ్, లాయిడ్ ఆస్టిన్ మధ్య సంభాషణ జరిగింది.
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం నాడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అవుతారు. నేతలిద్దరూ ఈ నెల 24న వైట్హౌస్లో సమావేశం అవుతారని అధ్యక్ష భవనం వెల్లడించింది. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక మోదీతో జరిగే తొలి భేటీ ఇదే కావడం విశేషం. దీంతో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు యూఎస్ ప్రెసిడెంట్ కార్యక్రమాల షెడ్యూల్లో మోదీతో సమావేశాన్ని ఖరారు చేశారు. 2019లో చివరిసారి మోదీ అమెరికాలో పర్యటించారు. కరోనా అనంతరం మోదీ జరపబోయే రెండో విదేశీ పర్యటన ఇదే! మార్చిలో ఆయన బంగ్లాదేశ్ను సందర్శించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్తోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మోదీ సెప్టెంబర్ 22న వాషింగ్టన్కు చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశం అవుతారు. క్వాడ్ లీడర్ సమ్మిట్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) యొక్క ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం సెప్టెంబర్ 24, 2021నఅమెరికా వాషింగ్టన్లో జరగనుంది. ప్రత్యేక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో కాలిసి భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. నాలుగు దేశాల నాయకులకు ఆతిథ్యమిస్తున్న మొదటి వ్యక్తి క్వాడ్ శిఖరాగ్ర సమావేశం ఇది. మార్చిలో, జో బిడెన్ వర్చువల్ ఫార్మాట్లో క్వాడ్ లీడర్ల మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.