రాజకీయాల్లో ఒక్కొసారి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విపక్షాలు ఎంత రెచ్చగొట్టిన కూడా వాటి ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలి. ఆవేశంతో మాట జారి… సవాళ్ళకు ప్రతిసవాళ్ళకు దిగితే..! వారి రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ…ఈ సారి అసెంబ్లీ ఎన్నికలల్లో గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఆమెకు ఒకప్పుడు రైట్ హ్యాండ్ గా వ్యవహారించినా సుబేందు అధికారి…ఎన్నికల వేళా… తృణమూల్ ను వీడి కమలం పార్టీకి జై కొట్టాడు.
సుబేందు కుటుంబానికి నందిగ్రామ్, జంగల్ మహల్ ప్రాంతాల్లో గట్టిపట్టుంది. ఈ ప్రాంతంలోని దాదాపు నలభై నియోజకవర్గాల్లో వీరి కుటుంబం మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం ఉంది. దీంతో ఇక ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ తన బలం కోల్పోయినట్లు అయ్యిందనే ప్రచారం జరిగింది. అయితే మమతా బెనర్జీ కూడా వెనక్కు తగ్గలేదు. నందిగ్రామ్ లో పర్యటించింది. నందిగ్రామ్, జంగల్ మహల్ ప్రాంతాల్లో తమ పార్టీ వీక్ కాలేదని…, తానే నంది గ్రామ్ నుంచి పోటీ చేస్తానని బీజేపీలో చేరిన సుబేందుకు సవాల్ విసిరారు.
దీంతో దీదీతో తాను సైతం పోటీకి సిద్ధమేనని సుబేందు సైతం ప్రకటించారు. పార్టీ తనను అభ్యర్థిగా నిలబెడితే… నందిగ్రామ్ లో మమతాను 50 వేల ఓట్ల తెడాతో ఓడిస్తానని ప్రతి సవాల్ విసిరాడు. అంతేకాదు మమతాను తాను ఓడించకపోతే… రాజకీయాల నుంచి సైతం నిష్క్రమిస్తానని మరింత వేడి రాజేశారు.
మరోవైపు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యనే మమతా బెనర్జీ… 291 మందితో కూడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాలు తమ పార్టీ మిత్రపక్షాలకు కేటాయించారు. ఈ మూడు స్థానాలు కూడా గోర్ఖాలు ఎక్కువగా నివసించే ప్రాంతంలోని నియోజకవర్గాలు. ఇక అభ్యర్థుల ప్రకటన సందర్భంలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. మార్చి 9న తాను నందిగ్రామ్ వెళ్తానని.. 10వ తేదీన హల్దియాలో నామినేషన్ వేస్తాని ఆమె తెలిపారు. నందిగ్రామ్ లో మమతా గెలుపుపై ధీమా ఉండటానికి అసలు కారణం… ఆ నియోజకవర్గంలో దాదాపు 70 వేలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయని…, వీరందరూ బీజేపీకి వ్యతిరేకంగా తనకే ఓటు వేస్తారని మమతా బలంగా విశ్వసిస్తున్నారని … ఆ ధైర్యంతోనే నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఇదంతా కూడా మమతాను ఓడించేందుకు కమలం పార్టీ వేసిన ట్రాప్ అని… మమతా ఆవేశంతో ఆ ట్రాప్ లో పడిపోయరని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. నిజానికి మమతా గత రెండు పర్యాయాలు కూడా భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2011లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆమె… 75 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారని.., 2016లో రెండవ పర్యాయం కూడా ఇదే నియోజకవర్గం నుంచి మమతా పోటీ చేశారు. అయితే ఈసారి ఆమె మెజారిటీ ఒక్కసారిగా తగ్గి…25వేలకు పడిపోయింది. సీఎం సొంత నియోజకవర్గం అయినా కూడా… తాము అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నామనే భావన అక్కడి ప్రజల్లో ఇప్పటికి కూడా వ్యక్తం అవుతూనే ఉంది. అంతేకాదు.. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో… భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో తృణమూల్ కాంగ్రెస్ కంటే కూడా ఇక్కడ బీజేపీ మెజారిటీ సాధించింది. ఈ కారణంతోనే మమతా ఇప్పుడు… భవానీపూర్ తోపాటు.. నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారని కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
మొదట మమతా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. మమతా సొంత నియోజకవర్గం భవానీ పూర్ నుంచి సీనియర్ నేత సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. అయితే ఈ స్థానం నుంచి కూడా మమతా పోటీలో ఉంటారని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. భవానీపూర్ నుంచి కూడా మమతా పోటీలోకి దిగితే… అక్కడ బీజేపీ తరపున కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోను బరిలోకి దింపాలని కమలనాథులు యోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో లో రెండు లక్షల మంది వరకు ఓటర్లు ఉండగా… వీరిలో 70 వేల మంది ముస్లిం ఓటర్లు, లక్షా 30 వేల మంది హిందూ ఓటర్లు ఉన్నారు. మమతా బుజ్జగింపు రాజకీయాల కారణంగా బెంగాల్ లో హిందూ ఓట్ల పోలరైజేషన్ ప్రారంభమైందని.. ఇది అండర్ కరెంట్ లా పనిచేస్తే మాత్రం మమతా బెనర్జీకి గడ్డుకాలమేనని అంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మమతా బెనర్జీ భావించారు. అయితే ఓడిపోతాననే భయంతోనే మమతా తన సొంత నియోజకవర్గం వదలి.. నందిగ్రామ్ లో పోటీకి దిగుతున్నారని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ లో తృణమూల్ కు పడిన ఓట్ల గణంకాలను బయటపెట్టి… నెగటివ్ స్టోరీలు రన్ చేయడంతో…ఆమె పునరాలోచనపడ్డారనే ప్రచారం జరుగుతోంది.