ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు. పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేసి కోర్టులో హాజరు పరిచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా ను బైకుల్లా జైలుకు, బద్నేరా (అమరావతి) ఎమ్మెల్యే రవి రాణాను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. తర్వాత నవీ ముంబై తలోజా జైలుకు మార్చారు. దీంతో రాణా దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు వారిపై ఏకంగా దేశద్రోహం కేసు కూడా పెట్టారు. ముంబై కోర్టు ఆదివారం ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను మే 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది.
హనుమాన్ జయంతి రోజున తన నివాసంలో శివసేన అధినేత థాకరే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని రవి రాణా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అలా చేయకపోతే, తాను మాతోశ్రీకి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని ప్రకటించారు. శనివారం నాడు మాతోశ్రీకి వెళతామని మొదట వారు ప్రకటించారు.. అయితే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా రానా దంపతులు తమ ప్రణాళికను రద్దు చేసుకున్నారు. అసలు మాతోశ్రీకి (ఉద్దవ్ థాకరే నివాసం) వెళ్లకుండా.. ఇంటి నుంచే బయటకు రాని వారి కోసం ఏ చట్టం కింద అరెస్ట్ చేశారని పలువురు మహారాష్ట్ర పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ఉన్నారు.