ఇటీవలి కాలంలో భారత సైన్యం పలువురు తీవ్రవాదులను అంతం చేసి జమ్మూ కశ్మీర్ లో శాంతి స్థాపనకై నడుం బిగించింది. తీవ్రవాదాన్ని వీడాలని ఎప్పటికప్పుడు యువతలో చైతన్యం నింపుతున్నాయి భారత బలగాలు. చాలా మందిలో మార్పు కనిపిస్తూ ఉండగా.. ఇంకా కొందరు పాకిస్థాన్ కుటిల పన్నాగాలలో భాగమవుతూ ఉన్నారు. భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న తీవ్రవాదులను భారత భద్రతా దళాలు అడ్డుకుంటూ ఉన్నాయి.
తాజాగా భారత భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని సొంతం చేసుకున్నాయి. శ్రీనగర్ శివారులో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. “ లష్కరే కమాండర్ సలీమ్ పర్రేను చంపడం పోలీసులకు పెద్ద విజయం. 2016లో 12 మంది పౌరులను హత్య చేయడంలో సలీమ్ పర్రే ప్రమేయం ఉందని” విజయ్ కుమార్ తెలిపారు. శ్రీనగర్ పోలీసులు సలీమ్ పర్రే ను లొంగిపోమని అడిగినా కూడా అతడు వినలేదు. పోలీసులపై ఎదురు కాల్పులు జరిపాడు.. దీంతో భద్రతా బలగాలు స్పందించాల్సి వచ్చింది అని అధికారులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు.
జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. చెప్పినా వినకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
బందిపోరా జిల్లాలోని హజన్ ప్రాంతానికి చెందిన పర్రే, A+ కేటగిరీ ఉగ్రవాది మరియు భద్రతా దళాల “మోస్ట్ వాంటెడ్ లిస్ట్”లో ఒకడు. షాలిమార్లో జరిగిన ఎన్కౌంటర్లో పర్రే మరణించాడు. 2022 సంవత్సరంలో పర్రేది రెండో ఎన్కౌంటర్. శనివారం, ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో భద్రతా దళాలు ఒక చొరబాటుదారుని హతమార్చాయి.