ఎన్నికల తరువాత పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న హింసకు సంబంధించి పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తమను ఎంతగానో వేధించారంటూ పలువురు తమకు చోటు చేసుకున్న అన్యాయాన్ని బయటపెడుతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత హింసకు బలైన బాధితులు.. అధికార పార్టీ మద్దతుదారుల చేతిలో అనుభవించిన దారుణాలను బయట పెడుతూ వస్తున్నారు.
ఎన్నికల తర్వాత హింస సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన కేసులన్నింటినీ పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) ముందుకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగగా కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మానవహక్కుల కమిషన్ విచారిస్తోంది. ఈ క్రమంలో ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో టీఎంసీ కార్యకర్తలు తమను ఎలా చిత్రహింసలకు గురి చేశారో బాధితులు మీడియాకు చెబుతూ వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు మే 2 న తమ పౌల్ట్రీ షాపును తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు దోచుకున్నారని.. ఆ తరువాత కోల్కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని తమ ఇంటికి తిరిగి రాలేకపోయామని మాముని సాహా, ఆమె భర్త రబీ సాహా ఆరోపించారు. ఎన్నికలకు ముందు మార్చిలో టీఎంసీ కార్యకర్తలు 10 కేజీల చికెన్ కొట్టాల్సిందిగా ఆదేశించారు. డబ్బులు అడిగితే లేవన్నారు. దాంతో మేం చికెన్ ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఫలితాల తర్వాత మా ఇంటి మీద దాడి చేశారు. కోళ్లఫారానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. మా ఇంటి ముందు బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. నన్ను నా భర్తను కొట్టారు అని తెలిపింది. భార్యాభర్తలను టిఎంసిలో చేరమని బలవంతం చేశారని ఆరోపించారు. ఏడాది క్రితం టిఎంసి మద్దతుదారులు ఈ జంటను బెదిరించారు. ఈ సమయంలో రబీ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. “నేను ఇంటికి తిరిగి రాలేదు. నేను ఫిర్యాదు చేయడానికి భవానీపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, పోలీసులు తమ చేతులు కట్టేశారని చెబుతూ ఫిర్యాదు తీసుకోలేదు, ”అని రబీ సాహా అన్నారు.
మాముని సాహా మాత్రం అదే ప్రాంతంలో నివసించడం కొనసాగించారు. అయితే మార్చిలో హోలీ సమయంలో 10 కిలోల చికెన్ ఇవ్వడానికి టిఎంసి మద్దతుదారులకు ఆమె నిరాకరించింది. అప్పటినుండి వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వారు మే 2 న దుకాణాన్ని దోచుకున్నారు. ఇప్పుడు దుకాణం ముందు ఒక బారికేడ్ ఉంది. నేను ఇంటికి తిరిగి రాలేను అని ఆమె అన్నారు. వీళ్ళు ఇప్పుడు భవానీపూర్లోని తమ ఇంటికి దూరంగా ఉన్న టోలీగంజ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
మూడు రోజుల క్రితం పోలీసు భద్రతతో తన ఇంటికి తిరిగి వచ్చింది రాఖీ రాయ్. పూర్బా బర్ధమాన్ జిల్లాలోని ఖండగోష్లో కు చెందిన ఆమెను టిఎంసి మద్దతుదారులు బెదిరించారని ఆరోపించారు. మే 2 ఆదివారం రాత్రి టిఎంసి మద్దతుదారులు తన ఇంటికి చొరబడ్డారని, ఆమెను కొట్టి, బట్టలు చించి, బయలుదేరమని హెచ్చరించారని, లేకపోతే “ఇది ఆమె జీవితంలో చివరి రోజు” అని బెదిరించారని రాఖీ రాయ్ తెలిపారు. మే 2 ఆదివారం నాడు ఫలితాలు వెల్లడైన అనంతరం టీఎంసీ కార్యకర్తలు మా ఇంటి మీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను చితకబాది.. నా బట్టలు చించేశారు. అంతటితో ఆగక నన్ను అసభ్యకరంగా తాకుతూ తెల్లవారేసరికి ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరించారు. సోమవారం ఉదయం మరోసారి వచ్చి నా పిల్లల్ని కొట్టారు. ఊరు విడిచి పోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు. వారి భయంతో మేం వేరే గ్రామానికి వెళ్లాం. ఆ తర్వాత పోలీసులు సెక్యూరిటీ కల్పించడంతో తిరిగి మా ఇంటికి వచ్చామని చెప్పారు. ఇంకా ఎంతో మంది బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ గూండాలు దారుణంగా ప్రవర్తించారు. చాలా మంది తమ బాధలను చెప్పుకొంటూ ఉన్నారు.
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మమత సర్కార్కు కోర్టులో షాక్ ఎదురైంది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది.