జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి సర్వేలో ఏపీలో అత్యధిక శాతం ప్రజలు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీకే మద్దతుగా నిలుస్తారని చెబుతోంది. 2019 లో గెలిచినన్ని సీట్లు మాత్రం గెలవలేరని సర్వే చెబుతోంది. కొన్ని సీట్లు మాత్రం తగ్గుతాయని వెల్లడించింది. వైసీపీ ఏపీలో 22 ఎంపీ స్థానాలు నెగ్గగా, 2024లో 18 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. వైసీపీ ఖాతాలోని ఆ 4 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. వైసీపీకి 127 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని సర్వే వివరించింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. తెలంగాణలో 2024 ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటుందని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు ఉండగా, వచ్చే ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించింది. అధికార టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు 3 స్థానాలు లభించవచ్చని అంటున్నారు.
2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో సీట్లు తగ్గుతాయని పేర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు చేజిక్కించుకోగా, ఈసారి 286 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, 2024 ఎన్నికల్లో 146 వరకు సీట్లను గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే వివరించింది. మోదీ ప్రధానిగా ఉండాలంటూ 53 శాతం మంది కోరుకుంటున్నారని.. రాహుల్ గాంధీని ప్రధానిగా 9 శాతం మందే కోరుకుంటున్నారని సర్వేలో తేలింది.