More

    కోవిన్ యాప్ ఇక ఇతర దేశాలకు కూడా అందుబాటులో..!

    భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమం జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! వ్యాక్సినేషన్ లో భాగంగా టెక్నాలజీ కూడా మనకు బాగా కలిసి వచ్చింది. కోవిన్ పోర్ట‌ల్‌ సాఫ్ట్‌వేర్ కారణంగా భారతీయులు కోవిడ్‌పై పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెల్లడించారు. టెక్నాల‌జీ కూడా మనకు స‌హ‌క‌రించింద‌ని, అదృష్ట‌వ‌శాత్తు సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి అవ‌రోధాలు లేవ‌ని, అందుకే కోవిడ్ ట్రేసింగ్‌, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్సుగా మార్చిన‌ట్లు మోదీ అన్నారు. కోవిన్ గ్లోబ‌ల్ స‌మావేశంలో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించారు. మ‌హ‌మ్మారి నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాక్సినేష‌న్ విధానం ఒక్క‌టే మాన‌వ‌ళికి ఆశాకిర‌ణం అన్నారు. మ‌న దేశంలో ముందు నుంచి వ్యాక్సినేష‌న్ కోసం డిజిట‌ల్ విధానాన్ని అవ‌లంబిస్తున్నామని తెలిపారు.

    కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్‌లో మోదీ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవటానికి ప్రపంచానికి డిజిటల్ ప్రజా ప్రయోజనంగా కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను భారతదేశం అందిస్తోందని అన్నారు. ఇకపై ఇత‌ర దేశాల‌కు కోవిన్ పోర్ట‌ల్‌ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుంద‌న్నారు. కోవిన్ యాప్‌తో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ స‌క్సెస్ సాధించినట్లు ఆయ‌న చెప్పారు. అన్ని దేశాల్లోనూ క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. గ‌త వందేళ్ల‌లో ఇలాంటి మ‌హ‌మ్మారిని చూడ‌లేద‌న్నారు. ఏ దేశ‌మైనా, అది ఎంత శ‌క్తివంత‌మైన‌దైనా, ఇలాంటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించడం అసాధ్య‌మ‌న్నారు.

    ఆరోగ్య సేత‌ను యాప్ స‌క్సెస్ అయ్యింద‌ని, 20 కోట్ల మంది ఆ యాప్‌ను వాడుతున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. యావ‌త్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భార‌తీయ‌ నాగ‌రిక‌త చూస్తుంద‌ని, మ‌హ‌మ్మారి వేళ ఈ త‌త్వాన్ని అంద‌రూ అర్థం చేసుకున్నార‌ని అన్నారు. అందుకే కోవిడ్ వ్యాక్సినేష‌న్ కోసం రూపొందించిన కోవిన్ టెక్నాల‌జీ ఫ్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా చేసిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. కోవిన్ ద్వారా భారతదేశంలో 350 మిలియన్ మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్లను వేశామని.. కొన్ని రోజుల క్రితం ఒకే రోజులో 9 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ప్రధాని తెలియజేశారు. టీకాలు వేయించుకున్న వ్యక్తులు పేపర్లను పట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదని.. కేవలం డిజిటల్ పద్ధతి చాలని ఆయన అన్నారు.

    Related Stories