కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారత ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే..! సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అవసరం భారీగా ఉండడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. భారతీయుల ఆక్సిజన్ అవసరాల కోసం ఎంతగానో కష్టాలు పడాల్సిన అవసరం వచ్చింది. థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో వేవ్ ను ఎదుర్కోవడం కోసం సమాయత్తమవుతూ ఉంది. భవిష్యత్ అవసరాల కోసం 15000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను భారత ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వేయలేరు కాబట్టి ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం అలర్ట్ చేస్తోంది. అందుకు సంబంధించిన ‘రోడ్ మ్యాప్’ ను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. భారతదేశంలోని అన్ని మూలల్లోనూ ఆక్సిజన్ ను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అవసరం 8000 కు పైగా మెట్రిక్ టన్నుల వినియోగానికి మే నెలలో చేరిన సంగతి తెలిసిందే..! కరోనా మొదటి వేవ్ పీక్ లో ఉన్న సమయంలో 3100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మాత్రమే ఉపయోగించారు. దీన్ని బట్టి థర్డ్ వేవ్ సమయానికి 15000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మెడికల్ ఆక్సిజన్ తయారీ ఊపందుకుంది. ఎన్నో ఆక్సిజన్ ప్లాంట్లలో పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిస్థితులను సమీక్షిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు చేయి దాటి పోకుండా ఆక్సిజన్ ను నిల్వ ఉంచుకోవాలని.. రాష్ట్రాలు కూడా అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం సూచనలను పాటిస్తూ ఉన్నాయి.
కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని.. ముఖ్యంగా పిల్లలపై థర్డ్ వేవ్ ప్రమాదం ఉంటుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. థర్డ్ వేవ్లో చిన్నారులపైనే కరోనా ప్రభావం ఎక్కువగా వుంటుందన్న భయాందోళనలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రతలను, మార్గదర్శకాలను విడుదల చేసింది.