కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు అందిస్తున్న భారత్.. విశ్వగురు పేరును సార్థకం చేసుకుంటోంది. జనవరి 20న ప్రారంభమైన భారత్ వ్యాక్సిన్ల ఎగుమతి అప్రతిహతంగా కొనసాగుతంది. మేడిన్ ఇండియా వ్యాక్సిన్లను ఇప్పటికే ప్రపంచం నలుమూలలకూ చేరుకున్నాయి. ఇప్పటివరకు దాదాపు 70 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఇలా మనదేశంలో తయారైన కొవిడ్ టీకాలను మిత్రదేశాలు, శత్రుదేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలకు సరఫరా చేస్తోంది భారత్. ‘గావి’ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ కు కూడా టీకాలు పంపిణీ చేస్తోంది. పేదదేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందాలన్న ఉద్దేశంతో.. ‘గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనైజేషన్’ఆధ్వర్యంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన ‘కొవాక్స్’ సంస్థకు కూడా.. భారత్ ఉదారంగా వ్యాక్సిన్లు అందజేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.
తాజాగా కెనడాకు సైతం భారత్ కొవిడ్ టీకాలు పంపిణీ చేసింది. గత వారం, 5 లక్షల డోసుల కోవిషీల్డ్ డోసులను పంపించింది. భారత్ చూపించిన ఔదర్యానికిగాను కెనడా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘థ్యాంక్యు ఇండియా, పీఏం నరేంద్ర మోదీ’ అంటూ కెనడాలో ఫ్లెక్సిలు వెలిశాయి. రాజధాని గ్రేటర్ టొరంటో రోడ్లపై భారత్తో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మోదీ ఫోటోతో పాటు భారత్, కెనడా జాతీయ జెండాలు సైతం ఫ్లెక్సీల్లో కనిపించాయి. కెనడాలోని హిందూ ఫోరం అధ్వర్యంలో ఏర్పాటయిన ఈ ఫ్లెక్సీల్లో భారత్, కెనడాల స్నేహం వర్ధిల్లాలి అంటూ నినదించాయి. గ్రేటర్ టొరంటో ఏరియాలో ఇలాంటివి తొమ్మిది కటౌట్లను ఏర్పాటు చేశారు. బ్రాంప్టన్లో మరో నాలుగు కటౌట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండో-కెనడియన్ కమ్యూనిటీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.
ఇదిలావుంటే, రానున్న రోజుల్లో యూరప్, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవులు, ఆఫ్రికాల్లోని మరో 50 దేశాలకు కూడా ఇండియా వ్యాక్సిన్లను పంపనుంది. ఐక్య రాజ్యసమితికి కూడా భారత్ 2 లక్షల డోసులను పంపించనుంది. కొన్ని రోజుల క్రితం, ఇండియా-స్వీడన్ మధ్య జరిగిన వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘మేడ్-ఇన్-ఇండియా’ టీకాలు ఇప్పటివరకు 50 కి పైగా దేశాలకు సరఫరా చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రణాళిక వేస్తున్నామన్నారు. భారత్ 150 కి పైగా దేశాలకు మందులు, ఇతర అవసరమైన వస్తువులను అందించిందన్నారు. దీంతోపాటు, భారత్ తన అనుభవాలను, ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలను, ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఫ్రంట్లైన్ వారియర్స్, ఆ దేశ చట్టసభ సభ్యులతో పంచుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.