హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్పై విశ్వాసం కోల్పోయారని.. వారంతా కేసీఆర్తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. అందుకే నియోజకవర్గాల్లో పనుల కోసమే వారు టీఆర్ఎస్లో కొనసాగుతున్నారని అన్నారు. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని తెలిపారు.
గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేయడం ఖాయం అని.. టీఆర్ఎస్ ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు చెప్పారని అన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని చెప్పారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ను ఎదుర్కొని.. రాష్ట్రం సుభిక్షంగా ఉంచాలంటే అది బీజేపీతోనే సాధ్యం అని చెప్పారు.