టోక్యో ఒలింపిక్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ లో రజతం గెలిచింది. చైనా లిఫ్టర్ ఝిహుయి హౌ స్వర్ణం దక్కించుకుంది. 49 కిలోల విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ లలో కలిపి ఆమె 202 కిలోల బరువునెత్తింది. స్నాచ్ లో 87 కిలోలు (84, 87, 89), క్లీన్ అండ్ జెర్క్ లో 115 (110, 115, 117) కిలోలు ఎత్తింది. చైనాకు చెందిన ఝిహుయి హౌ 210 కిలోల (94, 116) బరువునెత్తి స్వర్ణం సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్లిఫ్టింగ్లో మెడల్ గెలిచిన తొలి అథ్లెట్గా మీరాబాయి నిలిచింది.
మీరాబాయి చాను రజత పతకం స్వర్ణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా లిఫ్టర్ ఝిహుయి హౌకు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు మరిన్ని డోప్ టెస్టులు నిర్వహించాలని భావిస్తుండడమే అందుకు కారణం. హౌ గనుక డోప్ టెస్టుల్లో విఫలమైతే మీరాబాయి చానును పసిడి విజేతగా ప్రకటిస్తారు. ఝిహుయి హౌ పరీక్షలో విఫలమైతే భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకం సాధించిన తొలి మహిళగా మీరాబాయి చాను నిలిచే అవకాశం ఉంటుంది.
ANI మీడియా సంస్థ నివేదిక ప్రకారం “హౌ ను టోక్యోలో ఉండమని ఒలింపిక్ కమిటీ కోరింది. ఆమెకు డోపింగ్ పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఖచ్చితంగా జరుగుతుంది” అని కథనాలు వెలువడ్డాయి. 49 కిలోల విభాగంలో మీరాబాయి 202 కేజీలు బరువెత్తగా, చైనా లిఫ్టర్ హౌ 210 కిలోలతో ప్రథమస్థానంలో నిలిచింది. హౌ నుంచి సేకరించిన నమూనాల పరిశీలనలో తొలి శాంపిల్ ఫలితం తేడాగా రావడంతో అధికారులు మరికొన్ని పరీక్షలు చేసి, ఓ నిర్ధారణకు రానున్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు చైనా లిఫ్టర్ ఏమైనా నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకుందా ?అనేది ఈ డోప్ టెస్టుల్లో తేల్చనున్నారు. క్రీడలకు ముందు ఆమె కొన్ని ఔషధాలు తీసుకున్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా అధికారులు పరిశీలించనున్నారు.
ఝిహుయి హౌ స్నాచ్లో 94 కిలోలు ఎత్తి కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. తరువాత క్లీన్ అండ్ జెర్క్లో 116 కిలోలు ఎత్తి మరో ఒలింపిక్ రికార్డును సృష్టించింది. చైనాకు చెందిన ఝిహుయి హౌ డోపింగ్ కు పాల్పడి.. ఒలింపిక్స్ లో పోటీ చేసిందా అనే విషయం తెలియాల్సి ఉంది.